వాట్సాప్ చాట్ లీక్ : జేఎన్యూపై దాడి వాళ్ల పనేనా..? సంచలనం రేపుతోన్న స్క్రీన్ షాట్స్
దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లో జరిగిన హింసాకాండపై ఏబీవీపీ,వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఏబీవీపీకి సంబంధించిన ఓ వాట్సాప్ చాట్ బయటకు పొక్కి సంచలనంగా మారింది. జేఎన్యూలో దాడి కోసం ఏబీవీపీ సంసిద్దమైన తీరు గురించి 'ఇండియా టుడే' పలు వాట్సాప్ స్క్రీన్ షాట్స్ బయటపెట్టింది. బయటి వ్యక్తులను క్యాంపస్లోకి ఎలా తీసుకొచ్చారన్నది ఆ స్క్రీన్ షాట్స్ ద్వారా స్పష్టమవుతోంది.

ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ గ్రూపులో చాట్.. :
ఇండియా టుడే బయటపెట్టిన ఆ స్క్రీన్ షాట్స్లో వాట్సాప్ గ్రూప్ పేరు 'ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్'గా కనిపిస్తోంది. ఈ వాట్సాప్ గ్రూప్ ఆధారంగా కొంతమంది వ్యక్తులను గుర్తించడం జరిగింది. అందులో నిధి(ఏబీవీపీకి చెందిన జేఎన్యూ విద్యార్థి),రేణు సైనీ(ఆర్ఎస్ఎస్ అనుబంధ వ్యక్తి),యోగేంద్ర భరద్వాజ్(ఏబీవీపీ అనుబంధ వ్యక్తి),సందీప్ సింగ్(ఏబీవీపీ అనుబంధ వ్యక్తి),వినాయక్ గుప్తా(ఏబీవీపీ అనుబంధ వ్యక్తి) ఉన్నారు.

ఆ వాట్సాప్ చాట్లొ ఏముంది :
దాడి జరిగిన రోజు(జనవరి 5) తెల్లవారుజామున 5.33గంటలకు ఈ వాట్సాప్ చాట్ జరిగినట్టుగా గుర్తించారు. ఇందులో యోగేంద్ర 'వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటం కోసం ఈ గ్రూపులో చేరండి. దీనికి పరిష్కారం ఒక్కటే.. వాళ్లను పట్టుకుని చితకబాదడం'అంటూ చేసిన మెసేజ్ కనిపిస్తోంది. ఈ మెసేజ్ చేసిన ఆరు నిమిషాలకు వినాయక్ గుప్తా అనే వ్యక్తి స్పందిస్తూ.. 'ఢిల్లీ యూనివర్సిటీకి చెందినవారు ఖాజన్ సింగ్ స్విమ్మింగ్ పూల్ వైపు నుంచి జేఎన్యూలోకి ఎంటర్ అవాలి. ఇక్కడ మేము 25-30వరకు ఉన్నాం' అని బదులిచ్చాడు.

మరో మెసేజ్లో.. :
వినాయక్ గుప్తా మెసేజ్ చేసిన రెండు నిమిషాలకే సందీప్ సింగ్ అనే వ్యక్తి రిప్లై ఇచ్చాడు. 'మాల్ గేట్ వైపు నుంచి కూడా లోపలికి రావచ్చు'అని పేర్కొన్నాడు. ఈ స్క్రీన్ షాట్స్ ఇండియా టుడే చేతికి చిక్కిన తర్వాత.. సదరు మీడియా ప్రతినిధులు వారిని సంప్రదించేందుకు ప్రయత్నించారు. అయితే వినాయక్ గుప్తా ఫోన్ స్విచ్చాఫ్ కాగా.. యోగేంద్ర నంబర్ ఆటోమేటిగ్గా డిస్కనెక్ట్ అవుతోంది. దీన్నిబట్టి వారిద్దరు తమ సిమ్ కార్డులను ఎక్కడో విసిరేసి ఉంటారని అర్థమవుతోంది. మిగతా నంబర్స్ కూడా దాదాపుగా స్విచాఫ్ చేసే ఉండటం గమనార్హం.

ఢిల్లీ పోలీసులు ఏమంటున్నారు :
ఆ వాట్సాప్ గ్రూప్లో చాట్ చేసినవాళ్లలో.. జేఎన్యూలో దాడికి పాల్పడ్డ ముసుగు గ్యాంగ్లోని 30-50 మంది వరకు ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో ఇప్పుడిదే కీలకంగా మారింది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్స్ ద్వారా వారి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
'యూనిటీ ఎగైనెస్ట్ లెఫ్ట్' అనే మరో వాట్సాప్ గ్రూప్లోనూ ఇలాంటి చాట్ జరిగినట్టు గుర్తించారు. ఈ చాట్లను పరిశీలిస్తే రైట్ వింగ్ విద్యార్థులు బయటి వ్యక్తులను క్యాంపస్లోకి తీసుకొచ్చి దాడికి పాల్పడ్డారన్న విషయం అర్థమవుతోంది. అయితే ఏబీవీపీ విద్యార్థులు మాత్రం తమపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు.












Click it and Unblock the Notifications