కేజ్రీకి మరో తలనొప్పి: ఉల్లి స్కాంపై ఏసిబి విచారణ
ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్కు కొత్త తలనొప్పి వచ్చింది. రాష్ట్రంలో ఉల్లి కుంభకోణం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. ఇందులో ఢిల్లీ ప్రభుత్వం పాత్రపై అవినీతి నిరోధక శాఖ(ఏసిబి) విచారణకు సిద్ధమైంది. ప్రభుత్వం తక్కువ ధరకు ఉల్లిని కొనుగోలు చేసి.. ప్రజలకు ఎక్కువ ధరలకు అమ్మిందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ విచారణ జరుగుతోంది.
ఓ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందంతో కూడిన ఏసిబి బృందం ఉల్లి కుంభకోణంపై దర్యాప్తు జరపనుంది. సమాచార కార్యకర్త వివేక్ గార్గ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు నేపథ్యంలో ఏసిబి విచారణ జరుపుతోంది.
కేజ్రివాల్ ప్రభుత్వం రూ. 18కి కిలో ఉల్లిని కొనుగులో చేసి.. దానికి రెట్టింపు ధర రూ. 30కి కిలో ఉల్లిని ప్రజలకు అమ్మిందని ఆయన ఆరోపించారు. ఇదే ధరకు అమ్ముతూ సబ్సిడీతోనే అందజేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకుందని ఆయన చెప్పారు.

పత్రికల్లో రూ. 18కే కిలో ఉల్లిని అందజేస్తున్నట్లు ప్రకటనలిచ్చిన ప్రభుత్వం.. ఇందుకు విరుద్ధంగా రెట్టింపు ధరకు అమ్మిందని ఆరోపించారు. ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనల కోసమే రూ. 23లక్షలు ఖర్చు చేసిందని విమర్శించారు.
కాగా, తమ ప్రభుత్వంపై కొందరు పనిగట్టుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా అన్నారు. తాము ఏ విచారణకైనా సిద్ధమేనని మనీష్ సిసోడియే చెప్పారు.












Click it and Unblock the Notifications