హృదయవిదారకంగా నటుడి మృతి -చావుబతుకుల మధ్య ఊగిసలాటపై రాహుల్ వోహ్రా పోస్టులు వైరల్
కనికరం లేని కరోనా మహమ్మారి ఇప్పటికే 33లక్షల మందిని బలితీసుకుంది. భారత్ లో కరోనా మృతుల సంఖ్య 2.42లక్షలకు పెరిగింది. వైరస్ కాటుకు కోట్లాది కుటుంబాలు కకావికలం అయ్యాయి. ఎందరో సెలబ్రిటీలకుతోడు కరోనా మహమ్మారి మరో ప్రముఖుడిని బలితీసుకుంది. కొవిడ్ రోగులతో కిక్కిరిసిన ఆస్పత్రిలో మరణశయ్యలాంటి బెడ్ పై పడుకొని, ఆక్సిజన్, వైద్యం అందీ అందని స్థితిని, చావుకు దగ్గరైన భావనను సోషల్ మీడియాలో వివరిస్తూ, చివరికి తుదిశ్వాస విడిచిన ఆ నటుడి పోస్టులు అందరి హృదయాలను పిండేస్తున్నాయి..
యూట్యూబర్ గా కెరీర్ మొదలుపెట్టి, నటుడిగా, ఓటీటీ స్టార్ గానూ ఎదిగిన రాహుల్ వోహ్రా ఇక లేడు. ఉత్తరాఖండ్ కు చెందిన ఆయన కరోనా సోకడంతో కొద్దిరోజుల కిందట ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరారు. సరైన చికిత్స అందకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. రాహుల్ మృతిని ఆయన కుటుంబీకులు, సన్నిహితులు ఖరారు చేశారు..
''నాక్కూడా మంచి వైద్యం అందితే బతుకుతా' అంటూ ఫేస్బుక్లో తన పరిస్థితిని వెల్లడించిన కాసేపటికే నటుడు రాహుల్ వోహ్రా కన్నుమూశాడు. ఆ మాట చెప్పడానికి అతడు ఎంత వేదన అనుభవించి ఉంటాడో తలచుకుని సోషల్ మీడియా కన్నీరు పెడుతోంది. ఇక తాను బతికే అవకాశాలు లేవని ఓ నిర్ణయానికి వచ్చేసిన రాహుల్.. 'మళ్లీ పుడితే మంచి పనులు చేస్తా. ఇప్పటికైతే బతుకుతానన్న ఆశ లేదు'' అంటూ అతడు పెట్టిన పోస్ట్ హృదయాలను మెలితిప్పుతోంది. రాహుల్ తుదిశ్వాస విడిచిన విషయాన్ని థియేటర్ డైరెక్టర్-ప్లేరైట్ అరవింద్ గౌర్ నేడు ఫేస్బుక్ పోస్టు ద్వారా వెల్లడించాడు.
చంద్రబాబు ఇంటికి కర్నూలు పోలీసులు -'ఎన్440కే కరోనా వేరింట్'పై నోటీసులు -సీఎం జగన్కు సిగ్గులేదంటూ
డిజిటల్ ప్లాట్ఫామ్పై చిరపరిచితుడైన రాహుల్ కరోనా వైరస్ బారినపడిన తర్వాత చాలా సమస్యలు అతడిని చుట్టుముట్టాయి. ఆరోగ్యం రోజురోజుకు మరింతగా క్షీణిస్తుండడంతో జీవితంపై ఆశలు వదిలేసుకున్నాడు. తనకు సరైన వైద్యం అందడం లేదని ఊహించాడు. అందుకనే తనకు ఇంకాస్త మంచి వైద్యం అందితే బతుకుతానన్న ఆశను బయటపెట్టాడు. చివరికి బతుకుతానన్న ధైర్యాన్ని కోల్పోయాడు. ధైర్యం సన్నగిల్లుతోందంటూ నిన్న పోస్టు పెట్టాడు. చివరి నిమిషంలో మరో ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.