మీడియా రంగంలో అడుగు పెట్టిన అదాని: ఆ న్యూస్ ఛానల్ ఆయన సొంతం
న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అపర కుబేరుడు గౌతమ్ అదాని మీడియా రంగంలో అడుగు పెట్టారు. ఆయన సారథ్యాన్ని వహిస్తోన్న అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో త్వరలో మీడియా యూనిట్ కూడా చేరబోతోంది. ఇప్పటికే అదానీ గ్రూప్.. బొగ్గు గనులు, విమానాశ్రయాలు, పరిశ్రమలు, సెజ్, సిమెంట్ ఉత్పత్తి, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడిక మీడియా రంగంలోనూ అడుగు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అదాని చేతికి ఎన్డీటీవీ..
ప్రముఖ జాతీయ మీడియా సంస్థ న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ)ని గౌతమ్ అదాని కొనుగోలు చేయనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. త్వరలో ఎన్డీటీవీ- ఇక అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటిగా చేరనుంది. ఎన్డీటీవీ యాజమాన్యం చేతులు మారబోతోదనే వార్తలు కొద్దిరోజుగా వినిపిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ వార్తలు వెలువడిన తరువాత ఆ కంపెనీ షేర్లు కూడా అమాంతం పెరిగాయి. మధ్యలో కొంత జాప్యం చోటు చేసుకుంది.

ప్రణయ్ రాయ్ రాజీనామా..
వాటాలు, భాగస్వామ్యం విక్రయాల విషయంలో కొంత ప్రతిష్ఠంభన నెలకొంది. అది కాస్తా ఇప్పుడు తొలగిపోయింది. దీనితో ఎన్డీటీవీని విక్రయించడానికి ప్రస్తుత యాజమాన్యం అంగీకరించింది. దీనికి అనుగుణంగా ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధిక రాయ్.. తమ పదవులకు రాజీనామా చేశారు. ఎన్డీటీవీ బోర్డ్ ఆఫ్ ప్రమోటర్స్ హోదా నుంచి తప్పుకొన్నారు. సంస్థ ప్రమోటింగ్ ఎంటైటీ గ్రూప్ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వైదొలిగారు.

సెబికి ప్రతిపాదనలు..
ఎన్డీటీవీలో వారిద్దరికీ 29.18 శాతం వాటాలు ఉన్నాయి. ఈ మేరకు సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అందజేసింది. ప్రణయ్ రాయ్, రాధిక రాయ్ స్థానంలో గౌతమ్ అదాని.. తన ప్రతినిధులను ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ బోర్డ్లో అపాయింట్ చేశారు.

అదాని ప్రతినిధులుగా..
డైరెక్టర్లుగా సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సిన్నయ్య చెంగల్వరాయన్ను నియామించనున్నట్లు అదాని సంస్థ తెలిపింది. వారి నియామకాలకు బోర్డ్ కూడా ఆమోదం తెలిపింది. సంజయ్ పుగాలియా సీనియర్ పాత్రికేయుడు. ఇదివరకు సీఎన్బీసీ ఆవాజ్ మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్గా పని చేశారు. అదానీ ఎంటర్ప్రైజెస్లో మీడియా విభాగాన్ని ఆయనే పర్యవేక్షిస్తోన్నారు.

వాటాల విక్రయం..
షేర్ల బదిలీ వ్యవహారంలో ఎన్డీటీవీలో ప్రణయ్ రాయ్, రాధిక రాయ్లకు చెందిన 29.18 శాతం వాటాలు ఇకపై అదానీ ఎంటర్ప్రైజెస్కు దక్కుతాయి. మరో 26 శాతం వాటాల కోసం అదాని డిసెంబర్ 5వ తేదీ వరకు ఓపెన్ ఆఫర్ను ఇస్తోంది. 16.76 మిలియన్ షేర్లు లేదా 26 శాతం ఈక్విటీని కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్ ఈ ఓపెన్ ఆఫర్ పెట్టింది. కార్పొరేట్ రంగంలో చోటు చేసుకున్న ఈ పరిణామం చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications