ఉక్కుమనిషి రాజకీయ నిష్క్రమణ...గాంధీనగర్కు అద్వానీ దూరం
Recommended Video
ఆయన రాజకీయ దురందరుడు... పక్కా కాషాయవాది... సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత... భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు... రాజకీయ భీష్ముడని కూడా అంటారు.... కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో చక్రం తిప్పిన మనిషి ఇకపై భారత రాజకీయ ముఖచిత్రంలో కనిపంచరు. ఆయనే బీజేపీ కురవృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ.
గాంధీనగర్ నుంచి మాయమైన అద్వానీ పేరు
లాల్ కృష్ణ అద్వాణీ... భారత రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. అద్వానీ ప్రస్తుతం బీజేపీ ప్రకటించిన 184 మంది అభ్యర్థుల్లో గాంధీనగర్ నియోజకవర్గం నుంచి అద్వానీ పేరు కనిపించలేదు. ఇక్కడి నుంచి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేరు తెరపైకి వచ్చింది. అయితే గత 25 ఏళ్లుగా గాంధీ నగర్ నియోజకవర్గం నుంచి అద్వానీ పోటీ చేస్తూ వస్తున్నారు. అంతేకాదు పోటీచేసిన ప్రతిసారి అఖండ మెజార్టీతో లోక్సభలో అడుగుపెట్టారు. ఈ సారి ప్రకటించిన అభ్యర్థుల్లో గాంధీనగర్ నియోజకవర్గం నుంచి జాబితాలో అద్వానీకి చోటు దక్కకపోవడంతో ఆయన రాజకీయ చరిత్ర చివరి దశకు చేరుకుందనే భావించాలి.
అద్వానీ రాజకీయ జీవితం
14 ఏళ్ల వయస్సులోనే అద్వానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరాడు. ఆర్ఎస్ఎస్ కరాచీ బ్రాంచ్లో ప్రచారక్గా వ్యవహరించారు.దేశ విభజన తర్వాత ఆర్ఎస్ఎస్ అద్వానీని రాజస్థాన్కు ప్రచారక్గా పంపించింది.1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్లో సభ్యునిగా చేరారు.ఆ సమయంలో రాజస్థాన్కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం 1957లో పార్లమెంటరీ వ్యవహారాలు చూసుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. 1970లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.ఇక 1973లో జనసంఘ్కు అధ్యక్షుడు అయ్యారు.ఇక ఎమర్జెన్సీ తర్వాత జనసంఘ్తో పాటు పలు విపక్షపార్టీలు జనతాపార్టీలో విలీనం అయ్యాయి. జనతా పార్టీ టికెట్ పైనే మాజీ ప్రధాని వాజ్పేయి, అద్వానీలు 1977లో పోటీ చేశారు.
వారణాసి నుంచి మోడీ... గాంధీనగర్ నుంచి అమిత్ షా: బీజేపీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల
బీజేపీకి ఊపిరి ఊదిన వ్యక్తి అద్వానీ
ఇక జనతా పార్టీలో ఉన్న జనసంఘ్ వారంతా పార్టీని వీడి భారతీయజనతా పార్టీని స్థాపించారు. బీజేపీ పార్టీ వ్యవస్థాపకుల్లో అద్వానీ ఒకరు.ఇక అప్పటి నుంచి అద్వానీ వెనుదిరిగి చూడలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం విజయం సాధించడం సర్వసాధారమైపోయింది. ఇక వాజ్పేయి ప్రభుత్వంలో ఉపప్రధానిగా కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇక ఎలాంటి పరిస్థితులనైనా ఒకేలా తీసుకోగల మనస్తత్వం ఈ ఉక్కుమనిషిది. వాజ్పేయికి ఉదారవాది అని పేరుంటే అద్వానీకి హిందూత్వవాదిగా ముద్రపడింది. అంతేకాదు ఈయన వివాదాస్పదుడు అని అభిప్రాయం కూడా ఉంది.
మోడీ-షా వైఖరితో అద్వానీ అసంతృప్తి
ఇక అద్వానీ బీజేపీని తన భుజస్కంధాలపై మోసుకుంటూ వచ్చాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఆయన్ను పార్టీలో ఓ సాధారణ కార్యకర్తలా పరిగణించడాన్ని ఆయన జీర్ణించుకోలేకున్నారు. అంతేకాదు సీనియర్లను మోడీ షా ద్వయం పక్కన పెడుతోందనే అసంతృప్తితో అద్వానీ ఉన్నట్లు సమాచారం. ఇక రాష్ట్రపతిగా తనను పంపుతారని అద్వానీ ఆశలు పెట్టుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. కొన్ని సామాజిక సమీకరణాలతో అనూహ్యంగా రామ్నాథ్ కోవింద్ పేరు తెరపైకొచ్చింది. ఇక ఈ సారి బీజేపీ అధికారంలోకి వస్తే తనను రాష్ట్రపతి చేస్తారనే చిన్న ఆశ ఏదో మూలాన అద్వానీకి ఉంది. అయితే మోడీని చూస్తే అద్వానీ కెరీర్కు ఇక్కడితే ఫుల్స్టాప్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచే అద్వానీకి ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. ఎప్పుడూ అనర్గళంగా ఒక సమస్యపై మాట్లాడే అద్వానీ ఈ సారి ఎంపీగా ఉన్న ఆయన సభలో కేవలం 365 పదాలే మాట్లాడారంటే ఈ రాజకీయ భీష్ముడికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో తెలుస్తోంది.
మొత్తానికి అద్వానీకి గాంధీనగర్ సీటు ఇవ్వకపోవడంపై ఆయన వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మోడీ షా ద్వయం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ మార్క్ పాలిటిక్స్ను చూపిస్తున్నారనే అభిప్రాయం ఇటు పార్టీలోను అటు క్యాడర్లోను వ్యక్తమవుతోంది.