ప్రజలతో మమేకమవుతూ.. ఉదయాన్నే సైకిల్పై షర్మిల
హెర్క్యులెస్ కెప్టెన్ శక్తి సైకిలుపై ప్రతీరోజు ఉదయాన్నే తన నివాసం నుంచి షర్మిల బయటకు వస్తున్నారు.
ఇంఫాల్: మణిపూర్ లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ తో దాదాపు 16ఏళ్ల పాటు ఇరోమ్ చాను షర్మిల(44) సుదీర్ఘ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె దీక్ష విరమించడం.. దీనిపై రాజకీయ పంథాలో పోరాటం చేస్తానని ప్రకటించడం జరిగిపోయాయి.
ప్రస్తుతం షర్మిల ఏం చేస్తున్నారో తెలుసా!.. ఉదయాన్నే సైకిల్ పై ఇంటినుంచి బయటకు వస్తున్నారు. కనిపించిన ప్రతీ ఒక్కరిని పలకరిస్తూ.. వారి కష్ట నష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. త్వరలో తాను ప్రారంభించబోయే పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలియెన్స్ (పీఆర్జేఏ) పార్టీ గురించి జనానికి వివరిస్తూ, వారి మద్దతు కూడగడుతున్నారు.
హెర్క్యులెస్ కెప్టెన్ శక్తి సైకిలుపై ప్రతీరోజు ఉదయాన్నే తన నివాసం నుంచి షర్మిల బయటకు వస్తున్నారు. షర్మిల నివాసం న్యూ చెక్కాన్ ప్రాంతంలో ఉంది. కాగా, గురువారం నాడు ఇంఫాల్కు 20 కి.మీ. దూరంలో ఉన్న బరుని హిల్ ప్రాంతానికి షర్మిల సైకిల్ పైనే వెళ్లారు. అలా వెళ్తున్న క్రమంలో దారి పొడుగునా ప్రతీ ఒక్కరిని పలకరిస్తూ ఆమె సైకిల్ యాత్ర సాగింది.
దీనిపై స్పందించిన షర్మిల.. ఫిట్నెస్తో పాటు లక్ష్యం నెరవేరడానికి సైకిల్ యాత్ర ఉపయోగపడుతుందన్నారు. ప్రజలతో మమేకమవుతూ తన లక్ష్యాల గురించి వెసులుబాటు దొరికిందన్నారు. మణిపూర్ లో అధికారం దిశగా సాగాలంటే.. అంతకన్నా ముందు అన్ని ప్రాంతాల ప్రజల గురించి స్టడీ చేయాల్సిన అవసరముందన్నారు.
సైకిల్ యాత్ర వల్ల అది సాధ్యపడుతుందని, అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నాని ఆమె అన్నారు. ప్రజల కూడా తనకు మద్దతు పలకడం ఆనందంగా ఉందన్నారు. కాగా, 2002 నుంచి మణిపూర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఓక్రమ్ ఇబోబీ సింగ్పై రాబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇరోమ్ షర్మిల నిర్ణయించుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య టఫ్ ఫైట్ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.