9 బుల్లెట్లు దిగాయి.. రెండు నెలలుగా కోమాలో.. కానీ అనూహ్యంగా కోలుకున్నాడు
ఎన్ కౌంటర్ లో తీవ్రంగా గాయపడి న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో రెండు నెలలుగా కోమాలో ఉన్న సీఆర్పీఎఫ్ కమాండింగ్ ఆఫీసర్ సడన్ గా కళ్లు తెరిచాడు.
న్యూఢిల్లీ: అతడి శరీరంలోకి మొత్తం 9 బుల్లెట్లు దూసుకుపోయాయి. ఓ బుల్లెట్ తలలోకి దిగింది. కుడి కన్ను కూడా పోయింది. రెండు నెలలుగా అతడు మృత్యువుతో పోరాడాడు. వైద్యులు కూడా ఇక బతకడం కష్టం అనుకుని వెంటిలేటర్ కూడా తొలగించారు.
కానీ అనూహ్యంగా అతడు స్పృహలోకి వచ్చాడు, కోలుకున్నాడు, తిరిగి ఉద్యోగంలో కూడా చేరబోతున్నాడు. ఇదో అద్భుతం.. కోమాను జయించిన అతడే.. సీఆర్పీఎఫ్ కమాండెంట్ చేతన్ చీతా.
వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం ఫిబ్రవరి 14న బందిపోరాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్ కౌంటర్ లో సీఆర్పీఎఫ్ 45వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ చేతన్ చీతా తీవ్రంగా గాయపడ్డాడు.
Delhi: MoS Home Kiren Rijiju met Chetan Cheeta, who was injured during an encounter in J&K's Bandipora pic.twitter.com/G9mAXuUUTn
— ANI (@ANI_news) April 5, 2017
మొదట చీతాను శ్రీనగర్ లోని మిలిటరీ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. ఆ తరువాత ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. దాదాపు రెండు నెలలపాటు ఆయన ఉలుకు పలుకు లేకుండా కోమాలోనే ఉండిపోయారు.
ఓ దశలో వైద్యులు ఆశలు వదిలేసుకుని వెంటిలేటర్ ను కూడా తొలగించి, సాధారణ వార్డుకు షిప్ట్ చేశారు. కానీ చేతన్ చీతా మృత్యువుతో పోరాడాడు. చివరికి మృత్యువునే జయించి రెండు నెలల తరువాత మళ్లీ కళ్లు తెరిచాడు.
చేతన్ చీతా స్పృహలోకి వచ్చాడని తెలియగానే కేంద్ర మంత్రి రిజిజూ ఆయన్ని చూసేందుకు ఎయిమ్స్ కు విచ్చేశారు. జరిగినదంతా తెలిసిన తరువాత కూడా చీతా ధైర్యం చెక్కుచెదరలేదు. తిరిగి విధుల్లో చేరతానంటూ ధీమా వ్యక్తం చేశాడు.