మోడీ ఇక బినామీ ఆస్తులపై, గోల్డ్పై విరుచుకపడ్తారా?
బెంగళూరు: నల్లధనంపై పెద్ద నోట్ల రద్దు అస్త్రాన్ని ప్రయోగించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇక బినామావీ లావాదేవీలుపై, అక్రమ బంగారం కొనుగోళ్లపై విరుచుకుపడే అవకాశాలున్నాయి. పెద్ద నోట్ల రద్దుపై వెనక్కి తగ్గడానికి నిరాకరించిన ప్రధాని నల్లధనాన్ని బంగారంగా మార్చుకునే ప్రయత్నాలపై కొరడా ఝళిపించే అవకాసం ఉంది.
బినామీ లావాదేవీలను కూడా అరికడ్తామని ఇటీవల గోవా సమావేశంలో ఆయన సంకేతాలు ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దుపై గోవాలోనూ, కర్ణాటకలోనూ నరేంద్ర మోడీకి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. రూ.500, 1000 నోట్ల రద్దు తర్వాత మోడీ తొలిసారి ఆ విషయంపై గోవాలో మాట్లాడారు.
పెద్ద నోట్ల రద్దు చివరిది కాదని, దాంతో ఆగబోమని, ఈ విషయాన్ని తాను కచ్చితంగా చెబుతున్నానని ఆయన గోవాల్ అన్నారు. చిన్నపాటి నమ్మకమైన కొద్ది మందితో మాట్లాడిన తర్వాత పది నెలల క్రితమే పెద్ద నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆన తెలిపారు.
ఢిల్లీ అధికారులకు గోవాలో బినామీ ఫ్లాట్స్ ఉన్నాయని, ఆ విధమైన ఆస్తులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం చట్టం తెచ్చిందని ఆయన చెప్పారు. వర్షాకాలం సమావేశాల్లో పార్లమెంటులో బినామీ మార్పిడి (నిషేధ) సవరణ చట్టం, 2016ను ఆమోదించిన విషయం తెలిసిందే.
రియల్ ఎస్టేట్ రంగంలో నల్లధనాన్ని పెట్టేవారికి ఏడేళ్ల కఠిన కరాగార శిక్ష విధించడంతో పాటు అటువంటి ఆస్తులను ప్రభుత్వం ఆ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకుంటుంది. బినామీ ఆస్తులపై వచ్చే ఏడాది ప్రారంభంలో మోడీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించవచ్చునని అంటున్నారు. మెగా రూరల్ ప్రాజెక్టును కూడా ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని వచ్చే ఎన్నికలకు ముందు ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.