'లెనిన్ విదేశీయుడు, ఉగ్రవాది మనకెందుకు!', శ్యాంప్రసాద్ విగ్రహంపై విధ్వంసకాండ, మోడీ ఆగ్రహం
కోల్కతా/అగర్తాలా/చెన్నై/తిరువనంతపురం: త్రిపురలో ఇరవై అయిదేళ్ల తర్వాత ప్రజలు మార్పు కోరుకొని బీజేపీకి అవకాశమిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ విధ్వంసం చోటు చేసుకుంటోంది. ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు. అప్పుడే అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి.
త్రిపురలో
జేసీబీతో
లెనిన్
విగ్రహం
కూల్చివేత,
'తలతో
ఫుట్బాల్
ఆడుకున్నారు'
రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, లెఫ్ట్ పార్టీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. త్రిపురలో కొందరు రెండు లెనిన్ విగ్రహాలను కూల్చివేశారు. ఇది బీజేపీ మద్దతుదారుల పని అని లెఫ్ట్ పార్టీ నేతలు చెబుతుండగా, తమకు సంబంధం లేదని, మాకు అలాంటి అవసరం లేదని చెబుతోంది.
ఇన్నాళ్లు వామపక్షాల ప్రభుత్వంలో అణిపోయిన ప్రజలు ఆ పని చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీ చొచ్చుకుపోతోంది. చివరకు ఈశాన్య రాష్ట్రాల్లోను హవా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై కుట్రతో కొందరు ఇలా చేస్తున్నారనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
స్టాలిన్ విగ్రహం తర్వాత శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహంపై
త్రిపురలో రెండు స్టాలిన్ విగ్రహాలను తొలగించారు. దానికి ప్రతిగా కోల్కతాలో కాలిఘాట్లో భారతీ జన సంఘ్ శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహంపై దాడికి పాల్పడ్డారు. ఆయన ముఖంపై నల్లటి రంగు పోశారు. ఈ చర్యను బీజేపీ నేతలు ఖండించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
విగ్రహాల మీద దాడిపై మోడీ ఆగ్రహం
త్రిపురలో స్టాలిన్ విగ్రహాలు, కోల్కతాలో శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహం, తమిళనాడులో పెరియార్ విగ్రహంపై దాడి అంశంపైప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో విగ్రహాల దాడిపై చర్యలు తీసుకోవాలన్నారు. విగ్రహాలపై ఎవరు దాడి చేసినా వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి
మరోవైపు, కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఈ పని లెఫ్ట్ పార్టీదేనని బీజేపీ మండిపడుతోంది. కాగా, సోవియెట్ మాజీ నాయకుడు, కమ్యూనిస్టు దిగ్గజం లెనిన్ విగ్రహాలను త్రిపురలో ఆందోళనకారులు కూల్చివేశారు. బీజేపీ నేతలే ఈ ఘటనలకు పాల్పడ్డారని సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్.. రాష్ట్ర గవర్నర్, డీజీపీలతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు హింసను అదుపుచేయాలని ఆదేశించారు. మరోవైపు, ఇలాంటివి సరికాదని త్రిపురకు కాబోయే సీఎం అన్నారు.
త్రిపురలో విధ్వంసం అంటూ కోల్కతాలో ర్యాలీ
త్రిపురలో విగ్రహాల కూల్చివేత అల్లర్లకు దారి తీసింది. పశ్చిమ త్రిపురలోని అనేక ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. బీజేపీ, ఐపీఎఫ్టీ కార్యకర్తలు భయాందోళనలు సృష్టిస్తున్నారని సీతారాం ఏచూరి కోల్కతాలో ఆరోపించారు. తమ పార్టీకి చెందిన 514 మంది కార్యకర్తలపైన, 1539 ఇళ్లపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. 196 ఇళ్లను తగులబెట్టారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన 134 కార్యాలయాలపై దాడులు చేసి, లూటీలకు పాల్పడ్డారన్నారు. 64 కార్యాలయాలను తగులబెట్టారని ఆరోపించారు. త్రిపురలో విధ్వంసం అంటూ వారు కోల్కతాలో ర్యాలీ నిర్వహించారు. లెనిన్ విగ్రహాల కూల్చివేతలో బీజేపీ-ఆరెస్సెస్ పాత్ర ఉందని మమతా బెనర్జీ ఆరోపించారు.
బీజేపీ ఆగ్రహం, విదేశీ విగ్రహాలకు చోటు లేదు
మరోపక్క సీపీఎం కార్యకర్తలు తమ పార్టీకి చెందిన 49 మందిపై దాడులు చేశారని, 17 మంది ఆసుపత్రి పాలయ్యారని బీజేపీ ఆరోపించింది. లెఫ్ట్ పార్టీ పాలనలో అణచివేతకు గురైనవారే లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. హింసావాదాన్ని బీజేపీ ప్రేరేపించదని, ఆ పనిచేసేది వామపక్షమేనన్నారు. విదేశీ నేతల విగ్రహాలకు భారత్లో చోటులేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారామ్ అహిర్ వ్యాఖ్యానించారు.
మాటల యుద్ధం
లెనిన్ విదేశీయుడని, ఒకరకంగా ఉగ్రవాది కూడా అని, అలాంటి వ్యక్తి విగ్రహం మన దేశంలో ఉండకూడదని, కావాలనుకుంటే కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యాలయంలో దాన్ని పెట్టుకొని, పూజలు చేసుకోమనండి అని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి అన్నారు. విదేశీ నేతల విగ్రహాలకు భారత్లో చోటు లేదన్న మంత్రి హన్స్రాజ్ అహిర్ వ్యాఖ్యలను సురవరం సుధాకర్ రెడ్డి ఖండించారు.