భారత తొలి స్వదేశీ వ్యాక్సిన్ రెడీ -కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరిన భారత్ బయోటెక్
అగ్రరాజ్యాల ఫార్మా కంపెనీలకు ధీటుగా.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ది చేసిన మొట్టమొదటి స్వదేశీ కొవిడ్ వ్యాక్సిన్ రెడీ అయింది. 'కొవాక్సిన్' పేరుతో రూపొందించిన టీకాను భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతివ్వాల్సిందిగా భారత్ బయో టెక్ సంస్థ సోమవారం కేంద్రాన్ని అభ్యర్థించింది.
Recommended Video

రెండు రోజుల్లో మూడు వ్యాక్సిన్లు..
దేశంలో కరోనా సహా ఇతర వ్యాక్సిన్లకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం ‘డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి ఈ మేరకు దరఖాస్తు పెట్టుకున్నట్లు భారత్ బయోటెక్ సోమవారం తెలిపింది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ కూడా తన జర్మన్ బాగస్వామి బయోఎన్ టెక్ తో కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను భారత్ లో ఎమర్జెన్సీ కేసులకు వాడుకునే అనుమతివ్వాలంటూ ఆదివారం డీసీజీఐని కోరింది. మంగళవారం ఉదయం.. మరో ప్రముఖ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్.. స్విడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ వర్సిటీలతో కలిసి రూపొందించిన ‘కొవిషీల్డ్' వినియోగానికి కూడా అనుమతిని కోరింది. రెండు రోజుల వ్యవధిలోనే మూడు వ్యాక్సిన్లు భారత్ లో ఎమర్జెన్సీ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. అయితే..

తొలి స్వదేశీ వ్యాక్సిన్.. షాకింగ్
కరోనా విలయం తొలినాళ్లలోనే వ్యాక్సిన్ తయారీకి భారత్ బయోటెక్ ముందుకురాగా.. దాని ప్రయోగాలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సహకారం అందించింది. నెలల శ్రమ తర్వాత తొలి స్వదేశీ వ్యాక్సిన్ గా ‘కొవాక్సిన్' రూపొందింది. అయితే క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా కొవాక్సిన్ డోసు తీసుకున్న తర్వాత కూడా హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ కు రెండోసారి కరోనా సోకడం అందరినీ షాక్ కు గురించేసింది. అయితే భారత్ బయోటెక్ సంస్థ మాత్రం..

కొవాక్సిన్ సమర్థతపై అనుమానాలొద్దు..
కొవాక్సిన్ సమర్థవంతమైన, సురక్షితమైన, ప్రయోజనకరమైన టీకా అని భారత్ బయోటెక్ స్పష్టత ఇచ్చింది. కోవాగ్జిన్ టీకా రెండు డోసుల షెడ్యూల్ ఆధారంగా ఉందని,రెండు డోస్ లు వేసుకున్న తర్వాత పధ్నాలుగు రోజులకు యాంటీ బాడీస్ డెవలప్ అవుతాయని భారత్ బయోటెక్ వివరణ ఇచ్చింది. అనిల్ విజ్ ఒక్క సారి మాత్రమే టీకా డోస్ తీసుకున్నారని రెండో డోస్.. మొదటి డోస్ తీసుకున్న తర్వాత నెల రోజులకు ఇస్తామని కానీ దురదృష్టవశాత్తూ అనిల్ విజ్ ఈ లోపే కరోనా బారిన పడ్డారని సంస్థ వివరణ ఇచ్చింది. కాగా,

వ్యాక్సిన్ పంపిణీకి వేగంగా..
ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ సంస్థలు తమ వ్యాక్సిన్లను వాడేందుకు అనుమతివ్వాలంటూ దాఖలుచేసిన దరఖాస్తులపై డీజీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తుది పరిశీలనల తర్వాతే వ్యాక్సిన్ వినియోగానికి అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) కూడా ఈ వ్యాక్సిన్ల సమర్థతను సమీక్షిస్తుంది. మరోవైపు రష్యా, బ్రిటన్, బెహ్రెయిన, చైనా లాంటి దేశాలు మాస్ వ్యాక్సినేషన్లకు కూడా అనుమతిచ్చిన నేపథ్యంలో భారత్ లోనూ కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేసింది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా.. అన్ని రాష్ట్రాల సీఎస్ లకు అవసరమైన ఆదేశాలు జారీచేశారు. భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ రాబోయే అతి కొద్దివారాల్లోనే మొదలవుతుందని ప్రధాని మోదీ ఈనెల 4న చెప్పడం తెలిసిందే.












Click it and Unblock the Notifications