'ఆమె' భర్త, 'ఈమె' భార్య: ఏళ్లుగా కలిసుండి, పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు
ఒడిశా: గత ఏడాది సెప్టెంబర్ నెలలో సుప్రీం కోర్టు హోమోసెక్సువాలిటీపై సంచలన తీర్పు చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు ఒడిశాలో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఓ అమ్మాయి మరో అమ్మాయిని వివాహం చేసుకున్న ఈ సంఘటన ఒడిశాలోని కేంద్రపడ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
పట్టాముండి, మహాకాలపడ గ్రామాలకు చెందిన యువతులు సావిత్రి, మోనాలిసా కటక్లో చదువుకునే సమయంలో కలిసి హాస్టల్లో ఉండేవారు. అనంతరం ఇద్దరికీ కటక్లోని ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగం చేస్తూ ఒకే అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఎంతోకాలంగా కలిసి ఉంటున్న వీరి మధ్య ప్రేమ చిగురించింది.
దీంతో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం వారి వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు తిరస్కరించారు. దీంతో వీరిద్దరూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి పెళ్లి చేసుకున్నారు. వీరిలోనే ఒకరు భర్తగా, మరొకరు భార్యగా చెబుతూ అఫిడవిట్ను నోటరీలో రిజిస్ట్రేషన్ చేయించారు.