ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారు: నేనే సీఎం, శశికళ
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఐక్యంగానే ఉన్నారని, పార్టీలో ఎలాంటి గందరగోళం లేదని, పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తామని, ప్రజలే నన్ను సీఎం కావాలని వేడుకుంటున్నారని,
చెన్నై: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఐక్యంగానే ఉన్నారని, పార్టీలో ఎలాంటి గందరగోళం లేదని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ చెప్పారు. మాదంతా ఒకే కుటుంబంమని, ఎమ్మెల్యేల మధ్య ఎలాంటి సమస్యలు లేవని ఆమె మీడియాకు చెప్పారు.
డీఎంకే పార్టీ మద్దతుతోనే నా మీద పన్నీర్ సెల్వం ఆరోపణలు చేస్తున్నారని శశికళ మండిపడ్డారు. పన్నీర్ సెల్వంను బెదిరించి రాజీనామా చేయించారని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని శశికళ అన్నారు. పోయెస్ గార్డెన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన శశికళ వారితో పన్నీర్ సెల్వం విషయంపై చర్చించారు.

అనంతరం బయటకు వచ్చిన శశికళ ఆమె వర్గీయులకు అభివాదం చేశారు. తరువాత మీడియా అడిగిన ప్రశ్నకు పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరిస్తామని శశికళ స్పష్టం చేశారు. పార్టీలో తిరుగుబాటు చేసే వ్యక్తులకు స్థానం ఉండదని, అది ఎవరైనా సరే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని శశికళ అన్నారు.
ఇదే సమయంలో శశికళ పన్నీర్ సెల్వంతో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను నేరుగానే హెచ్చరించారు. పార్టీని వ్యతిరేకించి ప్రతిపక్షం డీఎంకేతో చేతులు కలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, కార్యకర్తలు మిమ్మల్ని క్షమించరని శశికళ అన్నారు.
అన్నాడీఎంకే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కదా అని మీడియా ప్రశ్నించగా ఇది ప్రతిపక్షం చేస్తున్న కుట్ర అని, వారే నన్ను సీఎం కావాలని వేడుకుంటున్నారని, నేనే సీఎం అవుతానని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ సమర్థించుకున్నారు. బుధవారం మళ్లీ ఎమ్మెల్యేలతో సమావేశం ఉంటుందని, అందరూ అందుబాటులో ఉండాలని పోయెస్ గార్డెన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి.












Click it and Unblock the Notifications