విమానం ఇంజన్లో మృతి: ఎయిర్ ఇండియా అండ
న్యూఢిల్లీ: ముంబై విమానాశ్రయంలో విమానం ఇంజన్లో ఇరుక్కుపోయి ప్రాణాలుకోల్పోయిన రవి సుబ్రమణియన్ కుటుంబానికి ఎయిర్ ఇండియా అండగా నిలిచింది. రవి సుబ్రమణియన్ మృతి పట్ల ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేసింది.
రవి సుబ్రమణియన్ కుటుంబానికి రూ. ఐదు లక్షల పరిహారం ఇస్తున్నామని, అంతే కాకుండా బాధిత కుటుంబంలో ఒకరికి ఎయిర్ ఇండియాలో ఉద్యోగం ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఈ విషయంపై ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వని లోహాని స్వయంగా స్పందించారు.
మా కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోయాం అంటూ విచారం వ్యక్తం చేశారు. త్వరలోనే రవి సుబ్రమణియన్ కుటుంబానికి రూ. ఐదు లక్షలు అందిస్తామని, ఆ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తామని స్పష్టం చేశారు.
శుక్రవారం రవి సుబ్రమణియన్ అంత్యక్రియలు జరుగుతాయని, ఉదయం 11 గంటలకు ఎయిర్ ఇండియా ఉద్యోగులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పిస్తామని అన్నారు. ఈ ఘటన ఎలా జరిగిందని మీడియా ప్రశ్నించింది.
ఇప్పటికే విచారణకు ఆదేశించాం, దర్యాప్తు జరుగుతున్న సందర్బంలో తాము వివరాలు తెలుసుకోకుండా స్పందించడం తొందరపాటు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని మాత్రం అన్నారు.
అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకూ ఎవరిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. బుధవారం రాత్రి 8.40 గంటల సమయంలో ముంబై నుంచి హైదరాబాద్ బయలుదేరవలసిన ఎయిర్ ఇండియా A1 619 విమానం ఇంజన్ లో చిక్కుకుని రవి సుబ్రమణియన్ మరణించిన విషయం తెలిసిందే.