Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..!
ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ రాష్ట్ర పునర్ విభజన చట్టంలో మార్పులు చేసేందుకు వీలుగా కేంద్రం ఇవాళ లోక్ సభలో సవరణ బిల్లు (Amaravati capital bill)ప్రవేశపెట్టింది. హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీనిపై రెండు గంటల పాటు చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. దీంతో వివిధ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతి రాజధాని బిల్లుకు మద్దతునిచ్చింది.
ఏపీ పునర్విభజన చట్టం 2014కు సవరణ చేసి అమరావతి ని రాజధానిగా నిర్ధారించేందుకు ఉద్దేశించిన బిల్లుపై చర్చను ముందుగా కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ ప్రారంభించారు. గతంలో తమ పార్టీ తెచ్చిన ఈ చట్టానికి సవరణలు చేస్తూ అమరావతిని రాజధానిగా నిర్ధారించేందుకు ఉద్దేశించిన తాజా బిల్లుకు మద్దతిస్తున్నట్లు మాణిక్కం ఠాకూర్ తెలిపారు. అయితే గతంలో యూపీఏ ప్రభుత్వం ఏపీ రాజధాని నిర్మాణానికి ఇచ్చిన హామీల్ని ఎన్డీయే సర్కార్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అమరావతి రాజధానికి కేంద్రం మద్దతివ్వాలని సూచించారు.

అనంతరం ఈ బిల్లుపై మాట్లాడిన టీడీపీ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగులో ప్రసంగించారు. ఈ బిల్లుకు మద్దతిచ్చే అవకాశం లభించడం అమరావతిలో భాగమైన గుంటూరు ఎంపీగా తాను గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎవరినీ నొప్పించకుండా 60 రోజుల్లో 29 వేల ఎకరాల భూముల్ని సేకరించిన నమ్మకం తమ సీఎం చంద్రబాబు అని పేర్కొన్నారు. వైసీపీ మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి 29 వేల మంది రైతులకు అన్యాయం చేసిందన్నారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో అమరావతి విషయంలో చేసిన అరాచకాల్ని గుర్తుచేశారు.

ఆ తర్వాత బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఈ బిల్లు ప్రవేశపెట్టేందుకు కారణమైన ప్రధాని మోడీ, అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, వైసీపీ అడ్డుకున్న తీరును వివరిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం ప్రసంగించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. విభజన చట్టం ప్రకారం రాజధానిని ఎంచుకునే హక్కు రాష్ట్రానికి ఉందన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఇప్పటికీ నిలబెట్టుకోలేదన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతికి 5 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా రైతులకు ప్రయోజనం కల్పించలేదన్నారు. అమరావతికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పలేని పరిస్ధితి ఉందన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ బిల్లు తెచ్చారన్నారు. కాబట్టి ఈ బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తూవాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications