అమరీందర్ షాకింగ్ కామెంట్స్-అవమానాలు భరించలేకే గుడ్ బై-కాంగ్రెస్ హైకమాండ్ పైనా ఫైర్
పంజాబ్ కాంగ్రెస్ లో రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. సీఎం అమరీందర్ సింగ్ కూ, పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూకు మధ్య నెలకొన్న విభేదాలు చివరికి కాంగ్రెస్ లో చిచ్చుకు కారణమయ్యాయి. సిద్ధూ ఇవాళ సీఎల్పీ భేటీ ఏర్పాటు చేయడంతో, అంతకంటే ముందే కొత్త సీఎం ఎంపికకు వీలుగా పంజాబ్ సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత తన రాజీనామాకు దారి తీసిన కారణాలపై అమరీందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ హైకమాండ్ చర్యలతో తాను అవమానానికి గురైనట్లు భావించినట్లు రాజీనామా అనంతరం పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వెల్లడించారు. తన వారసుడు ఎవరన్న ప్రశ్నకు సమాధానంగా కాంగ్రెస్ హైకమాండ్ ఎవరినైనా ఎంపిక చేసుకోవచ్చంటూ ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా తాను వ్యతిరేకిస్తున్న నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూకు హైకమాండ్ పీసీసీ అధ్యక్షుడి పదవి కట్టబెట్టడంతోనే అమరీందర్ అసంతృప్తి పతాకస్ధాయికి చేరింది. ఆ తర్వాత సిద్ధూ తనను ఎక్కడిక్కడ చెక్ పెడుతున్న నేపథ్యంలో ఆయన సీఎం పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో అమరీందర్ సింగ్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమల్లో వెనుకబడ్డారని తెలుస్తోంది. ఇదే అంశంపై పలుమార్లు హైకమాండ్ అయనకు గుర్తు చేసినా ఫలితం లేకపోయినట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని అమరీందర్ అమలు చేయలేదు. తాజాగా ఇదే హామీని తాము నిలబెట్టుకుంటామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ పంజాబ్ లో ఇవ్వడంపై హైకమాండ్ అసంతృప్తిగా ఉంది. అంతర్గత సర్వేలో అమరీందర్ పనితీరు బాగా లేదని, ఇది అంతిమంగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అధినేత్రి సోనియాగాంధీ భావించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ కలిసి అమరీందర్ కొంప ముంచినట్లు తెలుస్తోంది. అయితే పైకి సిద్ధూతో విభేదాలు కారణంగా కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం అంతకుమించిన యుద్ధం పంజాబ్ కాంగ్రెస్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.