కేంద్రంపై రాహుల్ ఎటాక్... ఒక్కసారి ఈ వీడియో చూడంటూ అమిత్ షా కౌంటర్...
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. చైనా దూకుడుకు ప్రధాని మోదీ లొంగిపోయారని... భారత భూభాగాన్ని డ్రాగన్ ఎలా ఆక్రమించుకుందని వరుస ప్రశ్నలు సంధిస్తున్నారు. అసలు గాల్వన్ వ్యాలీలో ఏం జరిగిందో దేశ ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చైనాతో ఘర్షణను రాజకీయం చేయవద్దని... ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా భారత్ ఏకాభిప్రాయంతో ఉండాలని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాహుల్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
రాహుల్... ఈ జవాన్ తండ్రి ఏమంటున్నాడో విను... : అమిత్ షా
'ఓ ఆర్మీ జవాన్ తండ్రి రాహుల్ గాంధీకి ఓ స్పష్టమైన సందేశం ఇస్తున్నాడు.' అంటూ ఓ వీడియోను అమిత్ షా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'చైనా విషయంలో భారత్ అంతా ఏకమవుతున్న తరుణంలో.. రాహుల్ కూడా సంకుచిత రాజకీయాలు మానుకుని దేశ ప్రయోజనాల కోసం మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది.' అని అమిత్ షా తన ట్వీట్లో పేర్కొన్నారు.

రాజకీయం చేయవద్దన్న జవాన్ తండ్రి..
అమిత్ షా పోస్ట్ చేసిన ఆ వీడియోలో ఓ ఆర్మీ జవాన్ తండ్రి మాట్లాడుతూ.. 'భారత సైన్యం అత్యంత శక్తివంతమైనది. అది చైనాను ఓడించగలదు. ఇలాంటి సమయంలో రాహుల్ రాజకీయాలు చేయవద్దు. నా కుమారుడు ఇండో-చైనా ఘర్షణలో గాయపడి కోలుకుంటున్నాడు. అతను మళ్లీ సైన్యంలో చేరి పోరాటం కొనసాగిస్తాడని ఆశిస్తున్నాను.' అంటూ పేర్కొన్నాడు. దేశ ప్రయోజనాల కోసం ఓ ఆర్మీ జవాన్ తండ్రి ఇంత నిబద్దతతో మాట్లాడుతుంటే... రాహుల్ మాత్రం ఇప్పుడు కూడా రాజకీయాలు చేయడమేంటని అమిత్ షా పరోక్షంగా ప్రశ్నించారు.

కేంద్రంపై రాహుల్ ఎటాక్...
గాల్వన్ ఘర్షణల తర్వాత రాహుల్ గాంధీ ప్రతీరోజూ ట్వీట్స్ ద్వారా కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. శనివారం ఉదయం కూడా దీనిపై ట్వీట్ చేసిన ఆయన.. 'చైనా దూకుడుకు లొంగిపోయి మన ప్రధాని భారత భూభాగాన్ని వదిలిపెట్టాడు. ఒకవేళ ఆ భూభాగం చైనాది అయితే... 1. మన సైనికులు ఎందుకు చంపబడ్డారు.. 2. అసలు మన సైనికులు ఎక్కడ చంపబడ్డారు..? అంటూ రాహుల్ ప్రశ్నించారు. శుక్రవారం చేసిన ఓ ట్వీట్లో.. 'ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతోంది.. గాల్వన్లో చైనా దాడి ప్రీ-ప్లాన్డ్. భారత ప్రభుత్వం అక్కడి సమస్యను పట్టించుకోలేదు. ఫలితంగా మన సైనికులు మూల్యం చెల్లించాల్సి వచ్చింది.' అంటూ పేర్కొన్నారు.

దౌత్యమా.. యుద్దమా..?
గాల్వన్ వ్యాలీలో చెలరేగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు,40 మంది చైనా జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్దం రాబోతుందా అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గాల్వన్ వ్యాలీని చైనా తమదేనని చెప్పుకోవడం భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై దౌత్యపరంగా ముందుకెళ్లాలా... దాడిని ప్రతిదాడితోనే తిప్పి కొట్టాలా అన్న వ్యూహాలపై ప్రధాని మోదీ సమాలోచనలు జరుపుతున్నారు. దేశంలోని అన్ని పార్టీల అధినేతలతో మాట్లాడి ఇప్పటికే కీలక సలహాలు,సూచనలు స్వీకరించారు. త్వరలోనే చైనాపై భారత్ స్పష్టమైన స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications