అమిత్షా 'మహా'వ్యూహం: అభ్యర్థుల కదలికలపై నిఘా
ముంబై: ప్రభుత్వంలోని అధికారులు, మంత్రుల కదలికలు, పని తీరుపై ప్రధాని నరేంద్ర నిఘా నేత్రాన్ని కేంద్రీకరించినట్లే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు, ప్రచార బాధ్యతను చేపట్టిన నాయకుల కదలికలపై బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్షా దృష్టి కేంద్రీకరించారు.
అభ్యర్థులు, ప్రచార నిర్వాహకులు పార్టీని పెడదోవ పట్టించకుండా నివారించటానికి ఆయన పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. పార్టీ రూపొందించిన షెడ్యూలు ప్రకారం అభ్యర్థులు, ప్రచార నిర్వాహకులు పని చేస్తున్నారా లేదా? నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారా లేదా? అన్న విషయాన్ని తన కార్యాలయం నుంచే తెలుసుకోగల చర్యలు చేపట్టారు.

ప్రచారానికి అభ్యర్థులు ఉపయోగించే వాహనానికి ఒక ప్రత్యేక పరికరాన్ని అమర్చి ఎప్పటికప్పుడు వారి కదలికలను పసిగడుతున్నారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) అన్న ప్రక్రియను అమిత్షా అమలు చేస్తున్నారు. ఈ పరికరం సహాయంతో అభ్యర్థులు వేసే ప్రతి అడుగును కనిపెట్టటానికి వీలుపడుతుంది. పోటీని ఆషామాషీగా తీసుకుంటూ ప్రచారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం, నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వకుండా చూసేందుకే ఈ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.
లోకసభ ఎన్నికలలో అమిత్ షా ఉత్తరప్రదేశ్లో ఈ విధానాన్ని ప్రయోగించి ఘన విజయం సాధించటంతో మహారాష్ట్రలోను చేపడుతున్నారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థి వాహనానికి జీపీఎస్ పరికరాన్ని బిగించటంతో ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కు పూర్తి సమాచారం అందుతోంది. పార్టీపై పట్టు బిగించిన అమిత్షా వ్యూహరచనలో అపారమైన అనుభవాన్ని గడించారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అమిత్ షా నాయకత్వానికి అగ్నిపరీక్షగా మారుతున్న నేపథ్యంలో ఆయన ఎన్నికల తతంగం పూర్తి అయ్యేలోపు మరిన్ని చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications