అమిత్ షా వార్నింగ్ : మాతో కలిసి పోటీ చేయని పార్టీల గతి ఏమవుతుందో తెలుసా..?
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా శివసేనపై శివాలెత్తారు. శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే లక్ష్యంగా ఆయనపై విరుచుకుపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా పార్టీలు 2019లో తమను కాదని ఒంటరిగా పోటీచేస్తే ఆ పార్టీలకు గట్టిగా బుద్ధి చెబుతామని శివసేనను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే ఏవైనా పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ అభ్యర్థులు కచ్చితంగా విజయం సాధిస్తారని జోస్యం చెప్పారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లాతూరు బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలు పొత్తలపై నెలకొంటున్న కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి పార్టీకోసం శ్రమించాలని చెప్పారు. శివసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వారి విజయానికి కృషి చేద్దాం లేదంటే ఓటమికి కృషి చేద్దాం అని కార్యకర్తలకు అమిత్ షా పిలుపునిచ్చారు.
మహారాష్ట్రలోని 48 లోక్ సభ స్థానాల గెలుపుపై దృష్టి సారించాలని చెప్పిన అమిత్ షా పొత్తుల గురించి తగిన సమయంలో ఆలోచన చేద్దామని చెప్పారు. అమిత్ షా శివసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మండిపడింది. బీజేపీ జాతీయాధ్యక్షుడికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడింది. తమపై ఎవరు పోటీచేసిన వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని శివసేన వెల్లడించింది. హిందుత్వ సిద్ధాంతాలను పాటించే పార్టీలు బీజేపీకి అక్కర్లేనట్టుగా ఉందని శివసేన వ్యాఖ్యానించింది. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ స్థానం ఏమిటో ప్రజలు తేల్చేశారని వెల్లడించింది. మహారాష్ట్రలో కూడా ప్రజలు బీజేపీకి బుద్ది చెబుతారని శివసేన అభిప్రాయపడింది.
బీజేపీ 40 స్థానాల్లో గెలుస్తుందని చెబుతోందంటే ఈవీఎంలను మానిపులేట్ చేసేందుకు తయారైనట్లు కనిపిస్తోంది. అంటే ఈవీఎంలతో పొత్తు కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉందని శివసేన ఎద్దేవా చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బీజేపీకి ఇంకా తలపొగరు తగ్గలేదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని వెల్లడించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీజేపీకి అంత అహంకారం తగదని చెప్పిన ఉద్ధవ్ థాక్రే.... హిందుత్వ, రామమందిర నిర్మాణంపై శివసేన తీసుకున్న స్టాండ్ బీజేపీకి నచ్చడం లేదని థాక్రే అన్నారు.