గ్యాంగ్ వార్: తీహార్ జైలులో ఖైదీ దారుణ హత్య
న్యూఢిల్లీ: కట్టుదిట్టమైన భద్రత ఉన్న తీహార్ జైలులో గ్యాంగ్ వార్ కారణంగా విచారణ ఖైదీగా ఉన్న యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. ఖైదీ హత్య కేసులో ఇద్దరు ఖైదీలను అదుపులోకి తీసుకుని పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు.
దీపక్ (29) అనే యువకుడి మీద హత్య, చోరీ కేసులు నమోదు అయ్యాయి. ఇతను 2008 నుండి తీహార్ జైలులో విచారణ ఖైదీ (అండర్ ట్రయల్ ఖైదీ)గా ఉన్నాడు. తీహార్ జైలులోని నెంబర్ 8 బ్యారెక్ లోని సెల్ లో దీపక్ ఉన్నాడు.
ఈ బ్యారెక్ కు అత్యంతకట్టుదిట్టమైన భద్రత ఉంది. దీపక్ ఉంటున్న సెల్ లో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న సత్పాల్, మన్ ప్రీత్ తో సహ నలుగురు ఖైదీలు ఉన్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో సెల్ కిటికి ఊచలు కత్తిరించిన నిందితులు దీపక్ మీద దాడి చేశారు.

ఇష్టం వచ్చినట్లు దాడి చెయ్యడంతో అతనికి తీవ్రగాయాలైనాయి. విషయం గుర్తించిన జైలు సిబ్బంది సెల్ తీసి దీపక్ ను అదే జైలులోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై దీపక్ మరణించాడని బుధవారం ఉదయం జైలు పీఆర్ వో ప్రసాద్ తెలిపారు.
హత్య చేసిన నిందితులు నిత్యం నియమాలు ఉల్లంఘించి సాటి ఖైదీలతో గొడవపడేవారని, వారి మీద అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని అన్నారు. దీపక్ ను హత్య చేసిన మన్ ప్రీత్ గతంలో సాటి ఖైదీని హత్య చేశాడని కేసు నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications