సీఏఏ నిరసనలు : షాహీన్బాగ్లో కలకలం.. నిరసనకారులను గన్తో బెదిరించిన వ్యక్తి..
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్బాగ్లో కొనసాగుతోన్న నిరసన కార్యక్రమంలో మంగళవారం కలకలం రేగింది. గన్తో నిరసన శిబిరం వద్దకు వచ్చిన ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి.. నేరుగా స్టేజీ పైకి వెళ్లారు. ఆపై ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాల్సిందిగా నిరసనకారులను హెచ్చరించారు. అంతేకాదు, ఆ రోడ్డును ఖాళీ చేయకపోతే చస్తారని బెదిరించారు.
సయ్యద్ తసీర్ అహ్మద్ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాల ప్రకారం.. అక్కడికి వచ్చిన ఇద్దరిలో ఓ వ్యక్తికి ఓ రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నట్టు చెప్పారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో వారు అక్కడికి వచ్చారని.. స్టేజీ పైకి ఎక్కి నిరసనను ఆపేయాల్సిందిగా బెదిరించారని తెలిపారు. అందులో ఒకతని వద్ద గన్ కూడా ఉన్నట్టు గుర్తించామన్నారు. వెంటనే అక్కడున్న నిరసనకారులంతా వారిని అడ్డుకుని గన్ను లాగేసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇదిలా ఉంటే,కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు నెల రోజులుగా షాహిన్బాగ్లో నిరసనలు కొనసాగుతున్నాయి. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా ముస్లిం మహిళలు ఇందులో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ వంటి వారు షాహిన్బాగ్ నిరసనలకు మద్దతు ప్రకటించారు. అంతేకాదు,కేంద్రం వెనక్కి తగ్గకపోతే దేశవ్యాప్తంగా మరిన్ని షాహీన్బాగ్లు పుట్టుకొస్తాయన్నారు.
#WATCH A person who had gone to Shaheen Bagh to talk to protestors brandished a licensed pistol at the protest site, today. More details awaited. (Source - Delhi Police) pic.twitter.com/kHFbUnt8KG
— ANI (@ANI) January 28, 2020
మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా షాహీన్బాగ్ నిరసనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల్లో షాహీన్బాగ్కి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు వేస్తే దేశాన్ని సురక్షితంగా తీర్చిదిద్దుతామని, తద్వారా షాహీన్బాగ్ వంటి నిరసనలకు అడ్డుకట్ట వేయవచ్చునని చెబుతున్నారు.