ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ ట్వీట్: నా మనవడి వీడియో చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు
ఆనంద్ మహీంద్ర... పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ సంస్థ మహాంద్రా గ్రూప్ అధిపతి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఈ మధ్యే ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతూ ప్రజల ఆకలి తీరుస్తున్న ఓ బామ్మకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్, గ్యాస్ స్టవ్ ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్న వ్యక్తి. సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించే వ్యక్తిత్వం. తన కంట ఏది కనపడినా నెటిజెన్లతో వెంటనే సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. తాజాగా మనసు కదిలించే ఓ వీడియోను పోస్టు చేశారు ఆనంద్ మహీంద్ర.
ఆనంద్ మహీంద్ర కంటతడి పెట్టిన వేళ..
ప్రతిసారీ నవ్వును తెప్పించే పోస్టును ట్విటర్లో తన మిత్రులతో, అభిమానులతో షేర్ చేసుకునే ఆనంద్ మహీంద్ర ఈ సారి మనసును కదిలించే ఓ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు కంటతడి పెడుతున్నారు. అంతేకాదు ఆ వీడియోను పోస్టు చేస్తూ ఓ భావోద్వేగంతో కూడిన మెసేజ్ను సైతం రాశారు ఆనంద్ మహీంద్ర. " నా మనవడి వీడియో కొద్ది రోజులుగా చూస్తున్నాను. ఇక ఈ వీడియో చూస్తుంటే నా కళ్లల్లో నీళ్లు ఆగడం లేదు. అందుకే పంచుకుంటున్నాను. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. అదే సమయంలో సవాళ్లు కూడా అధిగమించాల్సి ఉంటుంది. దీన్ని ఒక గిఫ్ట్గా తీసుకుని దాన్ని ఏమేరకు మనకు అనుకూలంగా మలచుకుంటామనేదే ముఖ్యం. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు నా జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఈ వీడియో చూస్తే నాలో ధైర్యం రెట్టింపు అవుతుంది " అంటూ ట్వీట్ చేశారు.
చిన్నారి పట్టుదలకు హ్యాట్సాష్
ఇంతకీ ఈ వీడియో ఏంటంటే... పుట్టుకతోనే చేతులు కోల్పోయిన చిన్నారి తన కాళ్లను వినియోగించి ఆహారం తీసుకుంటున్నాడు. కాళ్లతో ఫోర్క్ను పట్టుకుని పండ్లను తీసుకుని తన నోటిలోకి వేసుకుంటున్నాడు. అయితే ఈ వీడియోలో చాలా మందిని కదిలించిన అంశం ఏమిటంటే... ఆహారం నోటిలోకి వేసుకునే క్రమంలో తను మొదటి సారి విఫలమయ్యాడు. కానీ పట్టదలతో ప్రయత్నించి ఆహారంను నోట్లోకి వేసుకున్నాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు చిన్నారు. తొలి ప్రయత్నంలో విఫలం కాగా రెండో ప్రయత్నంలో ఫోర్కును మరో కాలితో పట్టుకుని ఆహారంను నోటిలోకి వేసుకున్నాడు.
ముఖంలో చిరునవ్వే కనిపించింది
ప్రయత్నించిన ప్రతిసారీ చిన్నారి ముఖంలో చిరునవ్వే కనిపించింది తప్పితే ఎక్కడా తాను నోట్లోకి ఆహారం పంపించేందుకు కష్టపడుతున్న భావన కనిపించలేదు. ఇదే దృశ్యం ఆనంద్ మహీంద్రతో పాటు, ఇతర నెటిజెన్లను కదిలించింది. కన్నీళ్లు పెట్టించింది. వీడియో పోస్టు చేయగానే కదిలిపోయిన నెటిజెన్లు కూడా కామెంట్స్ రాశారు. మీరు చేస్తున్న ఈ పోస్టులు చూస్తే మానవత్వంతో కదిలే హృదయాలు ఇంకా ఉన్నాయనే భావన కలుగుతోందని ప్రియా ప్రకాష్ అనే మహిళ రాసుకొచ్చింది.
నెటిజెన్లను కదిలించిన ఆనంద్ మహీంద్ర ట్వీట్
మరొకరు ఇలాంటిదే ఇంకో పోస్టు చేస్తూ నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి అంటూ రాసుకొచ్చారు. ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సందర్భంగా రెండు చేతులు లేని ఓ బాలుడు ఆహారం తీసుకుంటున్న వీడియోను పోస్టు చేశారు. తన వ్యాపార కార్యకలాపాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆనంద్ మహీంద్ర అప్పుడప్పుడు సమయం తీసుకుని తనకు నచ్చిన అంశాలపై ఇలా సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంటారు.