ఆంధ్రప్రదేశ్: కుక్కలు, పందులు పెంచాలంటే లైసెన్స్ తప్పనిసరి... ఏపీ ప్రభుత్వ జీఓ అమలుకు నోచుకుంటుందా?
ఆంధ్రప్రదేశ్లో కుక్కలకు, పందులకు లైసెన్స్ తప్పనిసరి చేస్తూ పంచాయితీ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ జీఓ నంబరు 693ని జారీ చేసింది.
లైసెన్స్ లేని కుక్కలను, పందులను అధికారులు పట్టుకుంటే వాటిని పెంచుకుంటున్నవారికి రూ.500 జరిమానా వేస్తారు.
లైసెన్స్ గడువు ముగిసిన 10 రోజుల్లోగా వాటిని రెన్యువల్ చేసుకోవాలి. లేకపోతే రోజుకు రూ.250 అపరాధరుసుం అదనంగా చెల్లించాలి. లైసెన్స్ కావాలంటే కుక్కలకు, పందులకు ముందుగా హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి.
- వెలగపూడిలో మాల వర్సెస్ మాదిగ: మధ్యలో చిక్కుకున్న అంబేడ్కర్-జగ్జీవన్ రాం
- ఏపీలో మూడు రాజధానులు వస్తాయన్న ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్లు ఎలా ఉన్నాయి
ఇంకా ఆ జీఓలో ఏముందంటే...
గ్రామాల్లో తిరిగే వీధి కుక్కలు, పందులను గుర్తించి బహిరంగ నోటీసులు జారీ చేయాలని కూడా పంచాయతీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అలాగే లైసెన్సు తీసుకోకుండా కుక్కలు, పందులను పెంచినా... లైసెన్స్ ఉంది కదా అని జంతువులను బయట వదిలేసినా... జరిమానా విధించాలని ఆదేశించింది.
అలాగే వాటిని పట్టుకున్న సమయంలో తమవని ఎవరూ ముందుకు రాకపోతే వీధి కుక్కలుగా, వీధుల్లో తిరిగే పందులుగా పరిగణించి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చెయ్యాలని పేర్కొన్నారు.
పంచాయతీల పరిధిలో కుక్కలు, పందులను పెంచుకుంటున్న ప్రతి ఒక్కరూ విధిగా ఆ ప్రాంత వెటర్నరీ వైద్యుడిచ్చే సర్టిఫికెట్లను సమర్పించాలి.
వాటిని పరిశీలించి ఉచితంగానైనా...నిర్దిష్ట మొత్తాలను కట్టించుకునైనా లైసెన్స్లను పంచాయతీ మంజూరు చేస్తుంది. బిళ్లల రూపంలోనో, బ్యాడ్జీల రూపంలోనే ఉండే ఆ లైసెన్సులను జంతువుల మెడలో కానీ, చెవులపై కానీ ఉండేలా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి.
గ్రామంలోకి పందులు రాకుండా పంచాయతీకి దూరంలో వాటి కోసం కొన్ని ప్రదేశాలను ఏర్పాటుచేయాలి.
అక్కడే పందుల పెంపకం జరిగేటట్లు చూడాలి. ఈ లైసెన్స్ వ్యవహారాల పర్యవేక్షణ కోసం గ్రామాల్లో ప్రత్యేక కమిటీని నియమించాలి.
ఈ కమిటీలో సర్పంచ్ కమిటీ చైర్ పర్సన్గా, గ్రామ కార్యదర్శి కన్వనీర్గా, పంచాయతీ సెక్రటరీ, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్, మండల పశుసంవర్ధక శాఖ అధికారి, గ్రామ పశుసంవర్ధక శాఖ సహాయకుడు, జిల్లా SPCA (Society for the Prevention of Cruelty to Animals) నామినేట్ చేసిన సభ్యులు, జంతు సంరక్షణ సంస్థల నుంచి ఇద్దరు వ్యక్తులు సభ్యులుగా ఉంటారు.
- లంబసింగి: 250 మంది ఉండే ఈ ఊరికి ఈ నాలుగు నెలల్లో లక్షల మంది వచ్చివెళ్తారు
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
జీఓ ఎందుకు?
గ్రామాల్లో వ్యాధుల వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంచాయితీ రాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇకపై కుక్కలను, పందులను పెంచుకోవాలంటే గ్రామ పంచాయతీల్లో లైసెన్సు తీసుకోవడం వలన వాటి లెక్కలు తెలుస్తాయి.
నగరాలు, పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా కుక్కలను పెంచుకోవడం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది.
గొర్రెలు, మేకలు వంటి వాటి కాపలాకు కూడా కుక్కలను పెంచుతుంటారు.
ఇకపై పంచాయతీ జారీచేసే లైసెన్స్లను కుక్కలు, పందులకు తగిలించాలి.
దీని వలన ఏది సురక్షితమైనదనే విషయం కూడా తెలుస్తుందని పంచాయితీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జీఓలో పేర్కొన్నారు.
"అయితే ఈ జీఓని పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ జారీ చేసింది కాబట్టి ఇది మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు వర్తించదు.
దానికి మున్సిపల్ శాఖ నుంచి వేరే జీఓ రావాలి. వచ్చినప్పుడు దానికి తగినట్లుగా చర్యలు చేపడతాం" అని జీవీఎంసీ కమిషనర్ జి. సృజన బీబీసీతో చెప్పారు.
- బెంగాల్తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- వాయిదాలు, అభ్యంతరాల తర్వాత ఎట్టకేలకు ఇళ్ల పట్టాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్లో కుక్కల దాడులు విపరీతంగా జరిగాయి. కొన్ని సంఘటనల్లో కొందరి ప్రాణాలు కూడా పోయాయి.
ఇంటి వద్ద ఆడుకుంటున్న పసిపిల్లలను కుక్కలు పీక్కుతిన్న సంఘటనలు విశాఖ, కర్నూలు, విజయవాడలో జరిగాయి.
అలాగే విశాఖలో జరిగిన మరో ఘటనలో కుక్కలు ఒక్కసారిగా మీదకు దూకడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ముగ్గురు భవన నిర్మాణకార్మికులు భవనంపై నుంచి దూకడంతో వారిలో ఇద్దరి ప్రాణాలు పోయాయి.
ఇక నెల్లూరులో రోడ్డుపై వెళ్తున్న మహిళపై రెండు పందులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
"కుక్కలు, పందులు స్వేచ్ఛగా రోడ్లపై సంచరిండం కూడా అనేక సమస్యలను తీసుకొస్తుంది. అవి రోడ్లపై మల విసర్జన చేస్తుంటాయి.
వేసవిలో అయితే అవి ఎండిపోయిన తరువాత గాలిలో దూళి కణాల రూపంలో కలిసిపోతాయి. అలాగే వర్షకాలంలో అయితే విసర్జకాలు నీటిలో కలిసిపోతాయి. కంటికి కనబడనంత సూక్ష్మ రేణువులు రోడ్లపై అమ్మే తినుబండరాలపై పడుతుంటాయి. అలాంటి రేణువులు పరిసరాలను కలుషితం చేస్తాయి. కలుషితమైన గాలి పీల్చడం, బయట తినుబండరాలు తినడం వల్ల వ్యాధులు వస్తాయి.
చిన్న పిల్లలు, వృద్దుల్లో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండడం వల్ల అలాంటి రేణువులతో ఫ్లూ, మెదడువాపు వ్యాధులు వస్తున్నాయి" అని అచ్యుతాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు కేశవరావు చెప్పారు.
- క్రిస్మస్: బైబిల్ను తొలిసారిగా తెలుగులోకి అనువాదం చేసింది విశాఖలోనేనా?
- స్నేహలత హత్య కేసు నిందితులకు 'దిశ’ చట్టం ఎందుకు వర్తించడం లేదు ?
కుక్కల లెక్కలేవి?
దేశంలో కుక్కలు, పందులకు లైసెన్స్ ఉండాలా?, లేదా? అనేది ఆయా రాష్ట్రాలు నిర్ణయించుకోవాల్సిందేనని... కేంద్ర స్థాయిలో ఒక చట్టమంటూ ఏదీ లేదని పశుసంవర్థక శాఖ అధికారులు చెప్పారు.
"మన రాష్ట్రంలో పందులు, కుక్కల లెక్కలు పూర్తి స్థాయిలో లేవు. వాటిని లెక్కించడం కూడా కష్టమే.
కేవలం స్టైరిలైజేషన్, టీకాలు, ఇతర అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వాటి వివరాలే ఉంటాయి. అవే వీటి గణనకు ఆధారం. అందుకే కుక్కలు, పందుల లెక్కలు కచ్చితంగా చెప్పలేం.
అయితే కేంద్రం చేపట్టిన 19వ పశు గణన లెక్కల ప్రకారం ఏపీలో కుక్కల సంఖ్య 1,22,106. ఆ తరువాత మళ్లీ కుక్కల లెక్కలు అధికారికంగా కేంద్రం, ఇటు రాష్ట్రం చేసిన దాఖలాలు లేవు. 20వ పశు గణన లెక్కల ప్రకారం ఏపీలో 1,46,045 పందులున్నాయి.
వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 1,18,540 ఉండగా....పట్టణ ప్రాంతాల్లో 27,502 ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ రెండు లెక్కలు వాస్తవానికి అమడ దూరంలో ఉన్నాయి’’ అని పశుసంవర్థక శాఖలోని పిగ్గరీ డెవలప్మెంట్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్గా పదవి విరమణ చేసిన డాక్టర్ గోపాలకృష్ణ బీబీసీతో చెప్పారు.
''ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు లక్షలకుపైగా కుక్కలు, ఆరు లక్షల వరకు పందులు ఉంటాయని అనధికార లెక్కలు ద్వారా తెలుస్తుంది.
పైగా సుప్రీంకోర్టు తీర్పు వలన కుక్కలను స్టెరిలైజేషన్ చేయడమే కానీ...చంపడానికి వీలు లేదు.
దాంతో కుక్కల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలోనే 1,76,873 వీధి కుక్కలున్నాయని ఒక అంచనా" అని ఆయన అన్నారు.
- దివీస్ను బంగాళాఖాతంలో కలిపేస్తామన్న జగన్ ఇప్పుడు అనుమతులు ఎందుకిచ్చారు
- నీటి కాలుష్యం: వైజాగ్ మరో ఏలూరు కానుందా?
అమలు సాధ్యమేనా?
''ప్రస్తుతం నగరాల్లో ఉన్న పెంపుడు కుక్కల్లో లైసెన్సు తీసుకుని పెంచుకుంటున్నవి 10 శాతానికి మించి ఉండవు.
ఇక పట్ణణాలు, పల్లెల్లో అరశాతమైనా అలాంటివి ఉంటాయో, లేదో అన్నది అనుమానామే. పందుల సంగతైతే అడగక్కరలేదు.
ఈ పరిస్థితుల్లో ఈ జీఓ ఎంతవరకూ అమలవుతుందో చెప్పలేం’’ అని విశాఖ కెన్నల్ క్లబ్ సభ్యులు సురేశ్ అన్నారు.
''ఇప్పుడు పట్టణాలు, గ్రామాల్లో కూడా కుక్కలని ఎక్కువగానే పెంచుతున్నారు. అయితే వాటికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తేనే, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడో వాటిని వీధుల్లోకి వదిలేస్తుంటారు.
ఇది వీధికుక్కల లెక్కల్లో చేరిపోతాయి. వీటిని పట్టుకున్నప్పుడు ఒక వీధిలో పట్టుకుని...మరో వీధిలో వదిలేస్తుంటారు.
దీని వలన కూడా ఎన్ని సార్లు గణన చేసినా కచ్చితమైన డేటా రాదు’’ అని ఆయన చెప్పారు.
"గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పందుల పెంపకం దారులు ఉంటారు. వారు ఇంత వరకూ పందులకు లైసెన్సులు తీసుకోవడం లేదు.
పెంపుడు కుక్కలకు కొన్ని చోట్ల ట్యాగింగ్ సిస్టమ్ లాంటివి ఉన్నాయి. కానీ ఎవరూ లైసెన్సులు తీసుకుంటున్న దాఖలాలు లేవు. నగరాలు, పట్టణాల్లో ఈ తరహా నిబంధనలు కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ, పంచాయితీల్లో దీనిని ఎలా అమలు చేస్తారు?
కొంతమంది పిల్లుల్ని, పక్షుల్ని కూడా పెంచుతారు. ఇళ్లలో కోళ్లు పెంచుతుంటాం. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో, దైవ క్షేత్రాల్లో కనిపించే కోతుల పరిస్థితేంటి? వాటికి కూడా రాబోయే రోజుల్లో లైసెన్సులు తప్పవా?" అని సురేశ్ సందేహం వ్యక్తం చేశారు?
- రైతుల నిరసనలు దేశాన్ని కుదిపేస్తుంటే, తెలుగు రాష్ట్రాల రైతులు ఏమంటున్నారు?
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
'మంత్రులను కరవవు’
"రాష్ట్రంలో కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది. మంత్రులను కుక్కలు కరవడం లేదు. అందుకే ఈ సమస్య వాళ్లకి తెలియడం లేదు. కానీ మాలాంటి వాళ్లను కుక్కలు కరిచేస్తున్నాయి. చాలా భయంగా బతుకుతున్నాం. దయచేసి కుక్కల సమస్యను త్వరగా పరిష్కరించడి" అంటూ 2018 సెప్టెంబర్లో అసెంబ్లీలో మాట్లాడిన అప్పటీ బీజెపీ ఎమ్మేల్యే విష్ణుకుమార్ రాజు ఈ జీఓని సమర్థించారు.
''ప్రభుత్వం ఈ జీఓని ఆదాయం కోసమే తీసుకొచ్చినా...మంచి కూడా జరుగుతుంది. కనీసం కుక్కలు, పందుల లెక్కలైనా కనీసం తెలుస్తాయి’’ అని అన్నారు.
"ఈ ప్రభుత్వం అన్ని విచిత్రమైన పనులు చేస్తోంది. ఆకస్మాత్తుగా ఆశ్చర్యకరమైన జీఓలను తెస్తుంది. ఇప్పుడు కుక్కలకి, పందులకి లైసెన్స్ అడిగినట్లే రేపు దోమలకి, ఈగలకి లైసెన్సులు పెడుతుందేమో! ఇటువంటి జీఓలు వలన ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప మరే ఉపయోగం ఉండదు’’ అని అన్నారు టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణ.
''పందుల పెంపకం కొందరి కులవృత్తి. వారికి తగిన విధంగా ప్రత్యామ్నాయం చూపించి, అవగాహన కల్పించి అప్పుడు లైసెన్స్ విధానం తీసుకురావాలి. వీధి కుక్కులకు ఎవరు లైసెన్స్ తీస్తారు? వాటిని ఏ లెక్కలోకి తీసుకుంటారు? కుక్కలని గ్రామ సింహాలంటారు. అవే గ్రామాలకు రక్షణ కల్పిస్తాయి. గ్రామంలోకి దొంగలు, కొత్త వ్యక్తులు వచ్చినా అవే రక్షణ కల్పిస్తాయి. అటువంటి వాటిని లైసెన్స్ లేదని తీసుకుపోయి చంపేయడమో, మరొక చోటుకి తరలించడమో చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా? డబ్బుల కోసం పిచ్చి ఆలోచనలు చేస్తూ ప్రజలను ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- బెంగాల్తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- 'కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- బాయ్ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- 'మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: 'మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- 'మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- అనిల్కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- కరోనావైరస్: బాబా రామ్దేవ్ 'కరోనిల్’ కోవిడ్ నుంచి రక్షిస్తుందా? - బీబీసీ పరిశోధన
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)