రా! చూసుకుందాం: ఢిల్లీలో ఊగిపోయిన రేణుకా చౌదరి
ఆంక్షలులేని తెలంగాణ, భద్రాచలం ముంపు గ్రామాల పరిరక్షణ కోసం శనివారమిక్కడ ఎపి భవన్లో తెలంగాణ విద్యార్థి ఐకాస నిర్వహించిన ధర్నాకు సంఘీభావం తెలపటానికి వచ్చిన ఆమెను టిజెఏసి నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రేణుకా గో బ్యాక్, సీమాంధ్ర తొత్తుల్లారా ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
రేణుకా చౌదరి స్వయంగా కారు నడుపుకుంటూ ఎపి భవన్కు చేరుకున్నారు. వచ్చీ రావటంతో భద్రాచలం ఖమ్మందే అంటూ నినదించారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపి, వారితో కలిసి ధర్నాలో కూర్చున్నారు. ఆ సమయంలో టిజెఏసి నేతలు కొందరు అక్కడే ఉన్నారు.
ఈ క్రమంలో రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడటం ప్రారంభించారు. ఆమె రెండు మాటలు మాట్లాడగానే ధర్నా స్థలికి కొద్ది దూరంలో గుమిగూడిన జెఏసి నేతలు ఒక్కసారిగా రేణుకకు వ్యతిరేకంగా నినాదాలరు చేశారు. తొలుత వారి నినాదాలను రేణుక పెద్దగా పట్టించుకోలేదు. ధర్నా శిబిరం వద్దకు వారు తరలివచ్చి ఆమెను అడ్డుకోవటానికి ప్రయత్నించటంతోపాటు వ్యక్తిగత విమర్శలకు దిగటంతో రేణుక ఆగ్రహంతో ఊగిపోయారు.
ఎవడ్రా నువ్వు.. మాట్లాడొద్దనడానికి అని మండిపడ్డారు. ఇలాంటివి చాలా చూశానని అన్నారు. పలువురు తెలంగాణ నేతలు ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో ఆమె ఊగిపోయారు. చేతులు పైకెత్తి టివాదులకు సవాళ్లు విసిరారు. 'నువ్వెవడివి మాట్లాడటానికి. రారా.. చూసుకుందాం.. పోరాపో.. నీదేరా డ్రామా' అంటూ ఊగిపోయారు. ఈ సమయంలో ధర్నా చేస్తున్న విద్యార్థులకు, జెఏసి నాయకులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం సద్దుమణిగింది.
భద్రాచలంలో ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపి, భద్రాచలం పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉంచుతామని చెప్పటం సరికాదని, భద్రాచలం రాములవారి ఆస్తులు ముంపు గ్రామాల్లో ఉన్నాయి. అవన్నీ పోతే రామాలయం ఆర్థిక పరిస్థితి ఏమిటి? రామాలయాన్ని, దాని ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమని, గిరిజనులను ఐక్యంగా ఉంచితేనే వారి సంస్కృతి చెడిపోకుండా ఉంటుందని ఆమె ఆ తర్వాత విలేకరుల సమావేశంలో అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు భద్రాచలం అంశాన్ని ప్రస్తావిస్తామన్నారు.
ఆ సమయంలో పలువురు కొందరు రాగా.. నాకేంటి భయం? భయం తన జాతకంలోనే లేదని, భద్రాచలంపై తొలి నుంచీ తాము పోరాడుతున్నామని అన్నారు. ముఖ్యమంత్రి తాను నమ్ముకున్న లక్ష్యం కోసం పని చేస్తున్నారని, ఆయనపై ఏం చర్య తీసుకుంటారనేది తెలియదని అన్నారు.