చంద్రబాబుకు బిగ్ రిలీఫ్- ఆ రెండు కేసుల్లో సీఐడీకి చుక్కెదురు ?
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు తర్వాత రిమాండ్ లో ఉన్న విపక్ష నేత చంద్రబాబు హైకోర్టు మధ్యంతర బెయిల్ తో విడుదలయ్యారు. అనంతరం హైకోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అప్పటికే మరో రెండు కేసుల్లో చంద్రబాబును పీటీ వారెంట్ పై తమకు అప్పగించాలని సీఐడీ చేసిన విజ్ఞప్తిని ఏసీబీ కోర్టు ఇవాళ తోసిపుచ్చింది. ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో చంద్రబాబు పీటీ వారెంట్లపై ఇవాళ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది.
స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత సీఐడీ ఆయనపై వరుస కేసులు నమోదు చేస్తూ వస్తోంది. ఇదే క్రమంలో ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లోనూ చంద్రబాబును నిందితుడిగా చేర్చింది. అయితే అప్పటికే చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టై జైల్లో ఉండటంతో ఆయన్ను పీటీ వారెంట్ పై తమకు విచారణకు అనుమతించాలని సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. అయితే ఆ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

స్కిల్ కేసులో హైకోర్టు నుంచి ముందు మధ్యంతర బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ అందుకున్న చంద్రబాబు ప్రస్తుతం వాటిపైనే ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ పై ఉన్న చంద్రబాబును పీటీ వారెంట్ పై తమ విచారణకు అప్పగించాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసుకున్న పిటిషన్లకు విలువ లేకుండా పోయింది. ప్రస్తుతం చంద్రబాబు బెయిల్ పై బయట ఉన్నందున వారెంట్లకు విచారణ అర్హత లేదని ఏసీబీ కోర్టు వాటిని తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబుకు ఈ రెండు కేసుల్లో తిరిగి అరెస్టు చేసి రిమాండ్ లో విచారణ కోరాల్సిన పరిస్దితి సీఐడీకి ఎదురవుతోంది.












Click it and Unblock the Notifications