రాజస్తాన్ కాంగ్రెస్ లో మరో చిచ్చు-గెహ్లాట్ పై మోడీ పొగడ్తలు-చర్యలకు సచిన్ పైలట్ పట్టు
రాజస్తాన్ కాంగ్రెస్ లో మరోసారి అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ చిచ్చు రేగింది. గెహ్లాట్ ను టార్గెట్ చేసేందుకు ఏ చిన్న అవకాశం లభించినా వదులుకోకుండా దూకుడుగా ముందుకెళ్తున్న సచిన్ పైలట్ కు తాజాగా ప్రధాని మోడీ గెహ్లాట్ పై చేసిన వ్యాఖ్యలు వరంగా మారాయి. దీంతో గెహ్లాట్ కూడా ఆజాద్ తరహాలో కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతారంటూ పైలట్ వ్యాఖ్యానించారు. ఇవి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలంటూ గెహ్లాట్ మండిపడ్డారు.
ఇవాళ రాజస్తాన్ లోని బన్స్వారాలో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోడీ రాజస్తాన్ ముఖ్యమంత్రి ఒకే వేదికపై కలిసి పాల్గొన్నారు. ఈ సభలో గెహ్లాట్ పనితీరుపై ప్రధాని మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. గతంలో గెహ్లాట్ , తానూ కలిసి ముఖ్యమంత్రులుగా పనిచేశామని మోడీ పేర్కొన్నారు. ఆయన తమ ముఖ్యమంత్రుల్లో అత్యంత సీనియర్ అన్నారు. ఇవాళ వేదికపై కూర్చున్నవారిలోనూ ఆయన గెహ్లాట్ సీనియర్ సీఎం అని మోడీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో చిచ్చు రేపాయి.
గతంలో సీనియర్ నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్ ను కూడా మోడీ ఇలాగే పొగిడారని, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసంటూ సచిన్ పైలట్ విమర్శలు ఎక్కుపెట్టారు. మోడీ వ్యాఖ్యలపై గెహ్లాట్ విమర్శలు చేయకపోవడాన్ని పైలట్ తప్పుబడుతూ ఇదంతా ఆసక్తికరంగా ఉందంటూ ట్వీట్లు చేశారు. దీంతో గెహ్లాట్ కాంగ్రెస్ అధిష్టానం జోక్యం కోరారు. పార్టీలో నేతలు బహిరంగవ్యాఖ్యలు చేయకుండా జోక్యంచేసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. పార్టీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. దీంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్లయింది.