పోలవరం ప్రాజెక్టుకు రూ.55 వేల కోట్లు ఇవ్వండి, అమిత్ షాతో జగన్ భేటీ..
రాష్ట్రంలో వరదలు, తుపాను నేపథ్యంలో వరద సాయం చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను అమోదించేలా సహకరించాలని విన్నవించారు. రెండవ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ప్రకారం 2017-18 ధరల సూచీ ఆధారంగా పోలవరం ప్రాజెక్టు కోసం రూ, 55,656 కోట్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వివిధ అంశాలపై గంటకుపైగా సమావేశం కొనసాగింది.
విన్నపాలు వినవలె..
అధికార వికేంద్రీకరణ, ఏపీ సమగ్రాభివృద్ధిలో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించేలా ప్రణాళిక వేసుకున్నామని అమిత్ షాకు తెలియజేశారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలుని చేస్తూ ఆగస్టులో చట్టం కూడా చేశామని గుర్తుచేశారు. హైకోర్టును కర్నూలుకు రీ లొకేట్ చేసేలా ప్రక్రియ ఆరంభించాలని, దీనికోసం నోటిఫికేషన్ జారీచేయాలని కోరారు. 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు అంశం ఉందని ప్రస్తావించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
దిశ, ప్రత్యేక కోర్టులు
సమగ్ర భూ సర్వేకోసం ఉద్దేశించిన ఏపీ ల్యాండ్ టైటలింగ్ అథారిటీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం పొందేలా చేయాల్సిన ప్రక్రియను పూర్తిచేయాలని జగన్ కోరారు. డిసెంబర్ 21న సమగ్ర సర్వే ప్రారంభమవుతుందని వెల్లడించారు. మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించడానికి తీసుకొచ్చిన దిశ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లులకు ఆమోదం పొందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
16 మెడికల్ కాలేజీలు
రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కళాశాలలను పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థనలు పంపామని, వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. దీర్ఘకాలంలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి కాలేజీలు చాలా కీలమని హోం మంత్రికి వివరించారు. ఉపాది హామీ పథకంలో భాగంగా పెండింగ్లో ఉన్న రూ.3,801.98 కోట్లను విడుదల చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అమిత్ షాను జగన్ కోరారు. ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రం స్వయం సమృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.