రైలు ప్రమాదం: కాలం చెల్లిన బ్యాటరీ కారణమా?
ముఖ్యంగా ఎసి కోచ్లకు బ్యాటరీ ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. దీంతో అనునిత్యం ఎలక్ట్రికల్ విభాగం వారు బ్యాటరీ పనితీరును ఎప్పటికప్పుడు పరీక్షించడంతోపాటు కాల పరిమితి దాటిన బ్యాటరీలను మారుస్తుంటారు. నాందేడ్ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదానికి గురైన కోచ్లో బ్యాటరీ కాల పరిమితి దాటి నెలలు గడిచినా మార్చలేదనే విమర్శలు వస్తున్నాయి. అందువల్లే అధిక సామర్థ్యంతో పనిచేయలేక షార్ట్సర్క్యూట్ జరిగి అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన అనంతరం శనివారం మధ్యాహ్నం గుంతకల్లుకు నాందేడ్ ఎక్స్ప్రెస్ చేరుకున్నపుడు ఎసిలు పనిచేయడం లేదని ప్రయాణికులు రైల్వే అధికారులతో వాదనకు దిగారు. దీంతో అప్పటికప్పుడు మిగిలిన ఎసి కోచ్ల బ్యాటరీలకు చార్జింగ్ చేయించి ఎసిలు పనిచేసేలా చూడడమే కాకుండా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఎలక్ట్రికల్ సిబ్బందిని కోచ్ల వెంటే పంపారు. గుంతకల్లులో బ్యాటరీలకు చార్జింగ్ చేయడం బట్టి చూస్తే రైల్లో అమర్చిన బ్యాటరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదన్న విషయం స్పష్టమవుతోంది.
దీనికి తోడు ఎసి బోగీల్లో కొందరు ప్రయాణికులు మరుగుదొడ్లలో సిగరెట్ కాల్చి అక్కడే పడవేయడంతో అప్పటికే అక్కడ ఉండే చిత్తుకాగితాలు అంటుకుని తద్వారా బ్యాటరీ వైర్లు కాలి షార్ట్సర్క్యూట్ జరిగి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై దర్యాప్తు చర్యలు ఊపందుకున్నాయి. ప్రమాదానికి గల కారణాలను వెలికితీసేందుకు కేంద్ర రైల్వేమంత్రి రెండు కమిటీలను నియమించిన విషయం విదితమే.
19 మృతదేహాల గుర్తింపు
నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అందజేసినట్లు సౌత్ వెస్ట్రన్ రైల్వే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ బిస్వాస్ ఆదివారం తెలిపారు. ఈశ్వర్ నగ్రే, అనిరుధ్ కులకర్ణి, లలిత, బసవరాజు, సర్వమంగళ, పద్మిని, అనిల్కుమార్, జూజార్జ్, ఖండోబా కులకర్ణి, ప్రేమలత, భీమయ్య, సుధ, లీలా, రామానందం, కృష్ణమూర్తి, సుభాష్రెడ్డి, చంపలాల్ రాతి, శ్రీనివాస్, శ్రీలత మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించినట్లు ఆయన చెప్పారు. మరో ఏడు మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు.