ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణం... ఇండియన్ రైల్వే చరిత్రలో చారిత్రక ఘట్టం...
ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది.జమ్ముకశ్మీర్లో చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కన్నా దీని ఎత్తు 35 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. 1.3కి.మీ పొడవైన ఈ బ్రిడ్జిని రూ.1,486 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఉధమ్పూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్(యూఎస్బీఆర్ఎల్)లో భాగంగా దీన్ని నిర్మించారు.
జమ్మూకశ్మీర్ను మిగతా భారతదేశంతో అనుసంధానించేందుకు యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో కీలకమైన చీనాబ్ నదిపై బ్రిడ్జి నిర్మాణంతో సోమవారం(ఏప్రిల్ 5) చారిత్రక మైలురాయిని చేరినట్లయింది. ఈ బ్రిడ్జి కోసం 28,600 టన్నుల స్టీల్,66వేల టన్నుల కాంక్రీట్ ఉపయోగించారు. దీని మొత్తం బరువు 10,619 మిలియన్ టన్నులు. దీని స్ట్రక్చరల్ డిటైలింగ్ కోసం టెక్లా సాఫ్ట్వేర్ను ఉపయోగించారు.
గంటకు 266కి.మీ వేగంతో వీచే ఈదురు గాలులను సైతం ఈ బ్రిడ్జి తట్టుకోగలదు. అత్యంత తీవ్రమైన భూకంపాలను కూడా తట్టుకోగలదు. బ్రిడ్జి నిర్మాణంలో వాడిన స్టీల్ 10డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకూ మన్నికగా ఉండగలదు. యూఎస్బీఆర్ఎల్ పూర్తి ప్రాజెక్టు మరో రెండున్నరేళ్లలో పూర్తి చేయనున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఈ బ్రిడ్జ్ ఆర్క్ నిర్మాణం పూర్తయ్యే ఘట్టాన్ని వీడియో లింక్ ద్వారా రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ వీక్షించారు. వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నార్తర్న్ రైల్వే జనరల్ మేనేజర్ అశుతోష్ గంగాల్ మాట్లాడుతూ.. భారతీయ రైల్వే చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని పేర్కొన్నారు. ఇలాంటి నిర్మాణం ఇంతవరకూ భారతీయ రైల్వే చరిత్రలో ఎక్కడా జరగలేదన్నారు.
A moment of pride for 🇮🇳! The arch of Chenab bridge, connecting Kashmir to Kanyakumari has been completed.
— Piyush Goyal (@PiyushGoyal) April 5, 2021
With an arch span of 467m, it is the world’s highest railway bridge.
PM @NarendraModi ji’s vision to connect India has inspired the Railway family to scale new heights pic.twitter.com/GEDEBIb9nE