జయలలిత మృతి వెనుక - శశికళ పై కమిటీ సంచలన నివేదిక..!!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆర్ముగస్వామి కమిటీ సమర్పించిన నివేదిక సంచలనంగా మారింది. జయలలిత మృతిపై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. శశికళను విచారించాలని ఆర్ముగస్వామి కమిటీ తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. జయ మరణంపై శశికళ వ్యవహారశైలిని వేలెత్తి చూపింది. శశికళ, నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్రావు సహా ఏడుగురి తీరును తప్పుబట్టిన కమిషన్ వారిపై విచారణ చేయించాలని సిఫారసు చేసింది.
చెన్నై అపోలో ఆస్సత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబర్ 5వ తేదీన జయలలిత మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కానీ, తాము విచారించిన సాక్షులు చెప్పిన వివరాలను బట్టి డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నమే జయలలిత మరణించారని తెలిసినట్టు తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించిన 475 పేజీల నివేదికలో కమిటీ పేర్కొన్నది. శశికళతోపాటు ఆమె బంధువైన వైద్యుడు కేఎస్ శివకుమార్, నాటి తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి జే రాధాకృష్ణన్, ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్ను కూడా విచారించాలని సూచించింది. అప్పటి తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్రావు, మరో ఇద్దరు వైద్యుల చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని నివేదికలో స్పష్టం చేసింది. వారిపై కూడా విచారణ జరుపాలని కోరింది.

జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ బెంగళూరు జైలుకెళ్లాక, ఓపీఎస్ ను దరి చేర్చుకునే ఒప్పందంలో భాగంగా 2017 సెప్టెంబరు 25న నాటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) నేతృత్వంలోని ప్రభుత్వం జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి విచారణ జరిపిన కమిషన్.. గత ఆగస్టులో నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదికను స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. నివేదికను అధ్యయనం చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని తదుపరి చర్యలు తీసుకొంటామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications