మోడీ పాలనలో దేశం నాశనమే.. జనాన్ని నాప్ కిన్స్ అనుకుంటున్నాడు : అరుణ్ శౌరీ
"మోడీ పాలనలో రానున్న మూడేళ్ల కాలంలో పౌర స్వేచ్ఛలను అణచివేసే ప్రయత్నాలన్ని మరింత పెద్ద ఎత్తున జరగవచ్చు. అయితే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగే సూచనలు ఉన్నాయి. బీజేపీని ప్రతిఘటించే ప్రతీ గొంతుకను నొక్కి వేసే ప్రయత్నం జరుగుతుంది. ఎదురు తిరిగిన వాళ్లకు బెదిరింపులు తప్పకపోవచ్చు". ఈ మాటలన్నది.. ఏ ప్రతిపక్ష పార్టీ నేతనో, మోడీ అంటే గిట్టనివాళ్లో చేసింది కాదు. సొంత పార్టీ నేత, అందునా వాజ్ పేయి హయాంలో బీజేపీ మంత్రి వర్గంలో పనిచేసిన సీనియర్ అగ్రనేత అరుణ్ శౌరీ చేసిన వ్యాఖ్యలివి.
మోడీపై తీవ్ర ఆరోపణలు చేసిన అరుణ్ శౌరీ.. మోడీ పాలన భారతదేశానికి ప్రమాదకరంగా పరిణమించబోతుందున్న అనుమానాలను వ్యక్తం చేశారు. మోడీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతాడని చెప్పిన ఆయన, ప్రస్తుతం దేశంలో నియంత తరహా పాలనా కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు. మోడీది ఏకవ్యక్తి పాలనగా అభివర్ణించిన ఆయన నరేంద్రమోడీ ప్రభుత్వం ఏ నియంత్రణకు తలొగ్గని అధ్యక్ష తరహా ప్రభుత్వమని పేర్కొన్నారు.

ఓ ప్రైవేటు ఛానెల్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు అరుణ్ శౌరీ. దాదాపుగా 40 నిమిషాల పాటు జరిగిన ఈ ఇంటర్వ్యూలో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ప్రజలను కరివేపాకులా ఉపయోగించుకోవడం మోడీకి అలవాటేనని చెప్పుకొచ్చిన ఆయన.. దేశంలో జరిగే అన్ని సంఘటనలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారన్నారు. మోడీ దృష్టిలో ప్రజలు పేపర్ నాప్ కిన్ లని, అలా ఆలోచించడం పట్ల ఆయన ఏమాత్రం పశ్చాత్తాపం చెందరని విమర్శించారు.
అగస్టా వెస్టు ల్యాండ్ కుంభకోణంలోను మోడీ సర్కార్ తీరును తప్పుబట్టిన శౌరీ, కేసు విషయంలో సహకరించలేదంటూ ఇటలీకి చెందిన అపీళ్ల కోర్టు జడ్జి చేసిన కామెంట్ మోడీ ప్రభుత్వానికే వర్తిస్తుందని చెప్పారు. కేసుకు సంబంధించి మోడీ ప్రభుత్వం అలసత్వ వైఖరిని అవలంభించిందని, అగస్టా వెస్టు ల్యాండ్ కంపెనీకి చెందిన ఇద్దరు మాజీ చీఫ్ లు గుస్సెప్పే ఓర్సి, బ్రూనో స్పాగ్నోలినిలను ఇటలీకి చెందిన ట్రయల్ కోర్టు నిర్దోషులుగా విడిచిపెడితే, మోడీ ప్రభుత్వం ఎందుకు అప్పీల్ చేయలేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications