100 రోజులు: తిరిగిచ్చేయాలని డిమాండ్, లోగో మార్చుకున్న ఆప్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ లోగో మారింది. ఇంతవరకు కాషాయం, ఆకుపచ్చ రంగుతో ఉన్న లోగో ఇక నుంచి నీలిరంగులో కనిపించనుంది. ఈ మేరకు ఆప్ తమ ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాల్లో కొత్త లోగోను ఉంచింది.
అయితే ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్సైట్లో మాత్రం వివాదాస్పద పాత లోగోనే ఉంచింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా లోగోను మార్చడం విశేషం. ఆమ్ ఆద్మీ పార్టీకి పెట్టిన కొత్తలో లోగోను వాలంటీర్ సునీల్ లాల్ తయారు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఏమైందో ఏమోగానీ గత నెలలో సునీల్ లాల్ తాను రూపొందించిన లోగోను ఏ విధంగానూ ఉపయోగించవద్దని డిమాండ్ చేశాడు. ఆ లోగోని న మేధో సంపత్తితో తయారు చేశానని, అయితే దానిపై అధికారం ఏ పార్టీకి ఇవ్వలేదని చెప్పాడు.
అంతేకాదు స్టేషనరీ, వెబ్సైట్స్, హ్యాండ్ బిల్లులు, ఫ్లాగ్స్, పోస్టర్లలో లోగోను ఉపయోగించడం ఆపాలంటూ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సునీల్ లాల్ లేఖ రాశాడు. వెంటనే తన లోగోని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, పార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు, వారి అంచనాలను అందుకోవడంలో విఫలమైందని పేర్కొన్నాడు.
ఆమ్ ఆద్మీ పార్టీలో వచ్చిన విభేదాల కారణంగానే సునీల్ లాల్ తన లోగోను తిరిగి తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది. ఆప్లో వచ్చిన విబేధాల వల్ల ఆ పార్టీ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత భూషణ్లను పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ బహిష్కరించిన సంగతి తెలిసిందే.