ఇరకాటంలో మోదీ.. జగన్, కేసీఆర్ బాసట.. రాత్రికిరాత్రే కీలక ప్రకటనలు.. చైనా హింస నేపథ్యంలో
''మన భూభాగంలో ఎవరూ చొరబడలేదు. ఏ ఒక్క భారతీయ పోస్టునూ కైవసం చేసుకోలేదు. ఒక్క అంగుళం కూడా ఎవరి స్వాధీనం కాలేదు'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై దుమారం కొనసాగుతోన్న వేళ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు మరోసారి కేంద్రానికి బాసటగా నిలిచారు. చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు, 20 మంది జవాన్ల మరణాలపై కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తం చేస్తుండగా.. ఈ సమయంలో ఇలాంటివి సరికాదంటూ జగన్, కేసీఆర్ లు మోదీకి బాసటగా నిలిచారు. అఖిలపక్ష సమావేశంపై ఇద్దరు సీఎంలు ఈ మేరకు శనివారం రాత్రి వేర్వేరుగా కీలక ప్రకటనలు చేశారు.

ప్రధానిపై ఆరోపణలు..
చైనా సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించడం తెలిసిందే. దేశసమగ్రత విషయంలో మోదీ సర్కారుకు అండగా ఉంటామంటూనే.. గాల్వాన్ హింసపై ఆయన చేసిన ప్రకటనను కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలు ఖండించారు. ఎవరూ ఎవర్నీ ఆక్రమించుకోకుంటే అసలీ అఖిలపక్షం భేటీ అవసరమేలేదని, చైనా దూకుడుకు మోదీ లొంగిపోయారని, ఆ భూభాగం చైనాదే అయితే.. మన సైనికులు ఎందుకు చనిపోయారు? అంటూ రాహుల్ గాంధీ, చిదంబరం, సీతారాం ఏచూరి లాంటి నేతలు ఆరోపణలు గుప్పించారు. దీంతో కేంద్రం మరోసారి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

పీఎంవో తర్వాత జగన్, కేసీఆర్..
మోదీ ప్రకటనపై ఆరోపణల నేపథ్యంలో ప్రధాని కార్యాలయం శనివారం ఓ కీలక ప్రకటన చేసింది. ప్రధాని వ్యాఖ్యలకు కొందరు వక్రభాష్యాలు చెబుతున్నారని, సైనికులు ధైర్యంగా పోరాడినందు వల్లే మన భూభాగంలోకి చైనీయులు అడుగుపెట్టలేకపోయారనే అర్థంలోనే ప్రధాని మాటల్ని చూడాలని పీఎంవో పేర్కొంది. సరిహద్దు సమగ్రత విషయంలో అనవసర రాద్ధాంతాలు వద్దని ప్రధాని కార్యాలయం హితవు పలికిన కొద్ది గంటలకే.. అఖిలపక్షం భేటీపై జగన్, కేసీఆర్ రెండోసారి ప్రకటనలు చేశారు.

జగన్ ఏమన్నారంటే..
భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తతపై ప్రధాని మోదీ శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష భేటీలపై అనవసర వివాదం సరికాదని, సాయుధ బలగాలకు అండగా ఉంటూ, దేశమంతా ఒక్కటేనన్న ఐక్యత చాటుకోవాల్సిన తరుణంలో లోపాలను ఎత్తి చూపడం కరెక్టు కాదని జగన్ వ్యాఖ్యానించారు. ఆల్ పార్టీ మీటింగ్ లో ప్రధాని, కేంద్ర మంత్రుల సమాధానాలు పూర్తి ఆమోదయోగ్యంగా ఉన్నాయని, విబేధాలు మన బలహీనతలను బయటపెడతాయంటూ ఏపీ సీఎం శనివారం రాత్రి ఓ ప్రకటన చేశారు. నిజానికి అఖిపక్షం భేటీ ముగిసిన వెంటనే దానిపై వైసీపీ సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. ప్రతిపక్ష పార్టీల విమర్శల నేపథ్యంలో రెండో సారి స్టేట్మెంట్ ఇచ్చారు.
Recommended Video

సంతోషం వ్యక్తం చేసిన కేసీఆర్..
‘‘రాజకీయ పరంగా మన మధ్య అనేక విబేధాలు ఉండొచ్చు. కానీ దేశభక్తి విశయంలో మాత్రం అందరం ఐక్యంగా ఉండాల్సిందే. అమరులైన జవాన్లకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ.. దేశ ప్రయోజనాలను కాపాడే విషయమై పూర్తి భరోసా ఇచ్చారు. అఖిపక్ష సమావేశం జరిగిన తీరుపై మేం సంతోషం వ్యక్తం చేస్తున్నాం'' అని తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం రాత్రి ప్రకటన చేశారు. భేటీకి సంబందించి కేసీఆర్ కూడా శుక్రవారమే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ.. మోదీపై విమర్శలు వద్దంటూ మరో ప్రకటన చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications