కరోనా విలయం:ఏపీలో అక్కడ భయానకం? దేశవ్యాప్తంగా 170 హాట్స్పాట్ జిల్లాలు.. కేంద్రం కీలక ప్రకటన..
మహమ్మారి కరోనా కంట్రోల్లోకి రాకపోగా, మరింత విలయతాండవం చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 1.3లక్షలకు చేరగా, 4.92లక్ష్లల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. అయితే ప్రపంచ సగటు(25 శాతం)తో పోల్చుకుంటే మన దేశంలో కొవిడ్-19 రికవరీ రేటు 11.41 శాతంగా ఉండటం కలవరానికి గురిచేస్తున్నది.
పైగా, ఈనెల 20 నుంచి కొన్ని రంగాలకు లాక్ డౌన్ మినహాయింపులు లభిస్తుండటంతో.. మొత్తం దేశాన్ని 3 కేటగిరీలుగా విభజిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రోజువారీ బ్రీఫింగ్ లో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ చీఫ్ సైంటిస్ట్ గంగా ఖేడ్కర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ కేసుల వివరాలతోపాటు పలు కీలక విషయాలు వెల్లడించారు.

170 హాట్ స్పాట్ జిల్లాలు..
మనదేశంలో మొత్తం 736 జిల్లాలు ఉండగా, వైరస్ వ్యాప్తి, కేసుల నమోదు, వాటి తీవ్రతను దృష్ట్యా వాటిని మూడు కేటగిరీలుగా విభజించామని, వాటిని హాట్ స్పాట్ జిల్లాలు, నాన్ హాట్ స్పాట్ జిల్లాలు, గ్రీన్ జోన్ జిల్లాలుగా పరిగణిస్తామని అగర్వాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా 170 జిల్లాలను హాట్ స్పాట్స్ గా, మరో 207 జిల్లాల్ని నాన్ హాట్ స్పాట్స్(తీవ్రత తక్కువ ఉన్నవి)గా గుర్తించామని చెప్పారు. ఇవిపోను మిగిలిన 359 జిల్లాలు గ్రీన్ జోన్లుగా ఉంటాయన్నారు. కాగా, 20 నుంచి అమల్లోకి వచ్చే సడలింపులు హాట్ స్పాట్ జిల్లాలకు వర్తించబోవని ఆయన స్పష్టం చేశారు.

అక్కడేం చేస్తారంటే..
దేశంలో ఇప్పటిదాకా ఎక్కడా వైరస్ సామూహిక వ్యాప్తి(కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్) జరిగిన దాఖలాలు లేవని, అయితే కొన్ని చోట్ల లోకల్ వ్యాప్తి జరిగినట్లు గుర్తించామని, దీంతోపాటు కేసుల నమోదు, రోగం తీవ్రత తదితర అంశాలను పరిశీలించిన తర్వాతే 170 జిల్లాలను హాట్ స్పాట్లుగా గుర్తించామని అగర్వాల్ వివరించారు. ఆయా జిల్లాలో లాక్ డౌన్ ఆదేశాలు కట్టుదిట్టంగా అమలుచేయాలని రాష్ట్రాలను ఆదేశించామని, అక్కడ ఇంటింటి సర్వేలను పకడ్బందీగా నిర్వహింస్తామని చెప్పారు. ఈ 170 జిల్లాల్లో పొలం పనులకు సంబంధించిన కార్యకలాపాల విషయంలోనూ అతిజాగ్రత్తగా వ్యవహరిస్తామన్నారు. అయితే..

ఏపీలో 11 జిల్లాలు?
హాట్ స్పాట్లుగా గుర్తింపు పొందిన 170 జిల్లాలు ఏవేవో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ప్రకటిస్తాయని కేంద్ర అధికారి అగర్వాల్ తెలిపారు. అయితే కొద్దిసేపటికే జిల్లాల జాబితాను కేంద్రమే విడుదల చేసింది. కేసుల తీవ్రత, వైరస్ విస్తరిస్తున్న తీరును బట్టి ఏపీలో బాగా ఎఫెక్ట్ అయిన గుంటూరుతోపాటు కర్నూలు, నెల్లురు, ప్రకాశం, కృష్ణా, కడప, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలను హాట్ స్పాట్లుగా గుర్తించారు.

తెలంగాణలో ఎలా?
హాట్ స్పాట్లుగా కేంద్రం గుర్తించిన 170 జిల్లాల్లో తెలంగాణకు సంబంధించిహైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ అర్బన్, జోగులాంబ గద్వాల, మేడ్చల్, మల్కాజ్ గిరి, కరీంనగర్, నిర్మల్, నల్గొండ జిల్లాలు ఉన్నాయి. కేంద్రం సూచనను బట్టి, ఈనెల 20 నుంచి లాక్ డౌన్ సడలింపులు ఈ జిల్లాలకు వర్తించబోదు. అయితే తగిన జాగ్రత్తలతో వ్యవసాయ పనులకు కొంత వెసులుబాటు లభించే అవకాశముంది.

దేశవ్యాప్తంగా పెరిగిన కేసులు..
కరోనా వైరస్ విజృంభణ మొదలైన తర్వాత.. గడిచిన 24 గంటల్లోనే కొత్త కేసుల నమోదు రికార్డు స్థాయిలో జరిగిందని కేంద్ర అధికారులు చెప్పారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం దాకా కొత్తగా 1173 కేసులు వచ్చాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,933కు, మరణాల సంఖ్య 392కు పెరిగిందని తెలిపారు. 11.4 శాతం రికవరీరేటుతో ఇప్పటిదాకా కొవిడ్-19 నుంచి 1,343 మంది బయటపడ్డారన్నారు.












Click it and Unblock the Notifications