ట్రిపుల్ తలాక్కు తిప్పలే! కుదరని ఏకాభిప్రాయం, కాంగ్రెస్ వైఖరిపైనే బిల్లు భవిష్యత్తు!
Recommended Video

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లుకు తిప్పలు తప్పేటట్టు లేదు. లోక్సభలో సంఖ్యా బలంతో సునాయాసంగా బిల్లును ఆమోదించుకున్న ఎన్డీయే ప్రభుత్వం... పెద్దల సభలో మాత్రం సందిగ్ధంలో పడింది.
కీలక బిల్లుల ఆమోదానికి సహకరించిన బీజేడీ, అన్నాడీఎంకే సైతం ట్రిపుల్ తలాక్ బిల్లులోని నిబంధనలను వ్యతిరేకిస్తుండటంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో పడింది కేంద్రం.

ఈ సమావేశాల్లోనే బిల్లుకు కేంద్రం పట్టు...
ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకు రాజ్యసభ చైర్మన్ సమక్షంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా మంగళవారమే సభ ముందుకు రావాల్సిన బిల్లు వాయిదా పడింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ బిల్లుకు చట్ట రూపం తేవాలని కేంద్రం పట్టుదలగా ఉంది.

నేడు తేలనున్న బిల్లు భవితవ్యం...
ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి ప్రతిపాదించాలని కాంగ్రెస్, సీపీఐ(ఎం)తో సహా విపక్షాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అయితే బిల్లును సెలక్ట్ కమిటీకి ప్రతిపాదించ కుండానే గట్టెక్కించాలని బీజేపీ యోచిస్తోంది. ఈ నేపథ్యం లో ట్రిపుల్ తలాక్ బిల్లు భవితవ్యం నేడు రాజ్యసభలో తేలనుంది.

బిల్లుకు కాంగ్రెస్ మద్దతిస్తుందా?
ట్రిపుల్ తలాక్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ అవలంబించే వైఖరి కీలకంగా మారనుంది. గతంలోనూ కీలక బిల్లుల సమయంలో యూటర్న్ తీసుకుని బీజేపీకి జై కొట్టిన కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఏం చేస్తోందనేది ఉత్కంఠభరింతంగా మారింది.

లోక్సభలో సునాయాసంగా నెగ్గిన బిల్లు...
ట్రిపుల్ తలాక్ పాటించే వారికి మూడేండ్ల శిక్ష, జరి మానా విధిస్తూ ముస్లిం మహిళ(వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. లోక్సభలో మెజార్టీలో ఉన్న ఎన్డీయే సర్కారు.. విపక్షాల సవరణలను తోసిరాజంటూ గత గురువారం సునాయాసంగా బిల్లును ఆమోదించుకుంది. లోక్సభలో చర్చ సమయంలోనూ సీపీఐ(ఎం), బీజేడీ, శివసేన, టీడీపీ తదితర పార్టీలు ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి ప్రతిపాదించాలని సూచించాయి. అయినప్పటికీ లోక్సభలో ఉన్న సంఖ్యాబలంతో కేంద్రం బిల్లును ఆమోదింపజేసుకుంది.

రాజ్యసభలోనే గడ్డు పరిస్థితి...
అయితే ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టరూపం దాల్చాలంటే దానిని రాజ్యసభ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుకు తగినంత సంఖ్యాబలం లేదు. ఒకవేళ కాంగ్రెస్ మద్దతు ఇవ్వకున్నా ఎఐడీఎంకే, బీజేడీ తదితర పార్టీలతో గట్టిక్కించాలని భావించినప్పటికీ.. సివిల్ అంశాల్లో పరిగణించే విడాకుల్లో 'క్రిమినల్' నిబంధనను పొందుపరచడాన్ని అన్ని పార్టీలూ వ్యతిరేకిస్తున్నాయి.

బిల్లుపై కుదరని ఏకాభిప్రాయం...
అయితే ప్రస్తుత రూపంలో బిల్లు ఆమోదానికి సహకరించేది లేదని ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్తో పాటు మిగతా విపక్షాలు స్పష్టం చేశాయి. ఈ బిల్లు ఆమోదంపై రాజ్యసభ చైర్మన్ ఛాంబర్లో మంగళవారం ఉదయం అన్ని పార్టీల ప్రతినిధులతో వెంకయ్య నాయుడు సమావేశమయ్యారు. కేంద్రం నుంచి పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి విజరుగోయల్ హాజరయ్యా రు. ట్రిపుల్ తలాక్ బిల్లును సెలక్ట్ కమిటీకి ప్రతిపాదించాలని విపక్ష పార్టీలన్నీ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ సమావేశంలో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుద రలేదు.

మొండి పట్టుదలతో కేంద్రం...
అయితే ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి ప్రతిపాదించే విషయంలో బీజేపీ అయిష్టంగా ఉంది. దీంతో బుధవారం సభలో ప్రవేశపెట్టి ఎలాగైనా ఆమోదించుకోవాలన్న పట్టుదలతో ఉంది. లోక్సభలో సహకరించినట్టుగా రాజ్యసభలోనూ కాంగ్రెస్ సహకరిస్తుందనే ఆశాభావంతో బీజేపీ నేతలున్నారు. గతంలోనూ కీలక బిల్లుల సమయంలో విపక్షాల తోడు వదిలి బీజేపీకి కాంగ్రెస్ పార్టీ వంతపాడింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లు విషయంలోనూ అదే జరుగుతుందన్న ఆశతో బీజేపీ నేతలున్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉన్నప్పటికీ మూడేండ్ల శిక్ష విధించాలన్న క్రిమినల్ నిబంధనను ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది.












Click it and Unblock the Notifications