రాజస్థాన్ సంక్షోభం: గెహ్లాట్ వద్ద ఉన్నది 84 ఎమ్మెల్యేలేనా? సచిన్ సవాల్, పెరుగుతున్న మద్దతు
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం అంతకంతకూ ఉత్కంఠగా మారుతోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెబుతున్నట్లుగా ఆయన వద్ద వంద మందికిపైగా ఎమ్మెల్యేలు లేరని, అంత బలం ఉంటే రిసార్టులకు కాకుండా అసెంబ్లీకి వెళ్లాలని సచిన్ పైలట్ వర్గం నేతలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

గెహ్లాట్ వద్ద 84 ఎమ్మెల్యేలేనా?
అశోక్ గెహ్లాట్కు మద్దతుగా కేవలం 84 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, మిగిలిన ఎమ్మెల్యేలంతా తమవైపే ఉన్నారని పైలట్ వర్గం నేతలు స్పష్టం చేస్తున్నారు. కాగా, పార్టీ అధిష్టానంతో తాను ఎలాంటి చర్చలూ జరపడం లేదని ఇప్పటికే సచిన్ పైలట్ ప్రకటించారు. అధిష్టానం ముందు ఎలాంటి షరతులూ ఉంచలేదన్నారు.

రిసార్టులు, హోటళ్లకు ఎందుకు?
బల ప్రదర్శన నిర్వహించాలనుకుంటే అందుకు ముఖ్యమంత్రి నివాసం, రిసార్టులు వేదికలు కావని.. అసెంబ్లీ మాత్రమేనని సచిన్ పైలట్ స్పష్టం చేశారు. ఒకవేళ అశోక్ గెహ్లాట్ తనకు తగిన సంఖ్యాబలం ఉన్నట్లయితే వారితో నేరుగా గవర్నర్ను ఎందుకు కలవలేదని.. హోటళ్లకు, రిసార్టులకు ఎందుకు తరలించారని ప్రశ్నించారు.

సచిన్ పైలట్ వర్గానికి పెరుగుతున్న మద్దతు..
కాగా, సచిన్ పైలట్ వర్గం రెబల్గా మారడంతో సీఎం గెహ్లాట్ సోమవారం సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 107 మంది హాజరైనట్లు గెహ్లాట్ వర్గం ప్రకటించింది. సీఎల్పీ సమావేశం ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించారు. మరోవైపు ఈ సమావేశానికి 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారని ప్రచారం జరిగింది. అంతేగాక, ఇద్దరు మంత్రులు కూడా గైర్హాజరయ్యారు. ఇప్పటికే మంత్రి రమేష్ మీనా తాను పైలట్ వైపు ఉన్నట్లు తెలిపారు.
Recommended Video

కొనసాగుతున్న ఉత్కంఠ...
ఈ క్రమంలో రాజస్థాన్ రాజకీయాలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. సచిన్ పైలట్ ఇప్పటికే బీజేపీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియాను భేటీ అయినట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా సచిన్ భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. అంతేగాక, సచిన్ తన మద్దతుదారులతో బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఇదే జరిగితే మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్ రాస్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. అయితే, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు సచిన్ పైలట్తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సీఎం గెహ్లాట్, కాంగ్రెస్ తీరుపై తీవ్రఅసంతృప్తి ఉన్న సచిన్ పైలట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా, సచిన్ పైలట్ వద్ద 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications