ఈ ఏనుగులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు: ఏం జరిగింది..?
నేరం చేసిన వారెవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని చట్టం చెబుతోంది. అయితే మూగజీవాలు నేరం చేస్తే పరిస్థితేంటి..? వాటికి శిక్ష వేస్తారా అనేదానిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. అయితే ఇక్కడ జరిగిన ఓ ఘటన మాత్రం నేరస్తులు ఎంతటివారైనా సరే ఎలాంటి వారైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అని సూచిస్తోంది. ఇంతకీ ఇక్కడ నేరం చేసిందెవరు.. అరెస్టు అయ్యిందెవరు.. తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Recommended Video

ఏనుగులు అరెస్టు
అస్సాం రాష్ట్రం గోలాఘాట్ జిల్లాలో ఓ విచిత్రమైన కేసు ఎదురైంది. అక్కడి పోలీసులు ఓ ఏనుగును దాని పిల్లను అరెస్టు చేశారు. ఇదేంటి.. ఏనుగును పోలీసులు అరెస్టు చేయడమేంటి.. అనే కదా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. అరెస్టు చేయడమే కాదు... ఒక నేరస్తుడికి బేడీలు ఎలా అయితే వేస్తారో... ఈ ఏనుగులకు కూడా బేడీల రూపంలో ఇనుప గొలుసులతో కట్టేశారు. మనిషి అయితే స్టేషన్లోని సెల్లో వేస్తారు. కానీ ఇవి భారీ శరీరం ఉన్న గజరాజులు కావడంతో స్టేషన్ బయటే కట్టిపడేశారు.

ఈ ఏనుగులు చేసిన నేరం ఏంటి
ఇక ఈ ఏనుగులు పోలీస్ స్టేషన్ బయట కట్టి ఉండటం చూసి అటుగా వెళుతున్న పాదచారులు ఆగి మరీ వాటిని ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక ఈ ఏనుగులు చేసిన నేరం ఏంటంటే.. గత వారం ఓ 14 ఏళ్ల బాలుడిని చంపేశాయి. తల్లి ఏనుగుతో పాటు పిల్ల ఏనుగుకు కూడా ఈ నేరంతో సంబంధం ఉందని అధికారులు తేల్చేయడంతో తల్లితో పాటు పిల్ల ఏనుగును కూడా అరెస్టు చేశారు. ఇక ఈ ఏనుగులను బొకఖాత్ నియోజకవర్గం ఎమ్మెల్యే జితేన్ గొగోయ్ పెంచుకుంటున్నాడు. తల్లి ఏనుగు పేరు దులుమోని.

అధికారులపై ఒత్తిడి
జూలై 8వ తేదీన నహారాజన్ టీఎస్టేట్కు సమీపంలో బిజులీ ప్రాంతంలో చిన్నారిని చంపేశాయి. ఇక చిన్నారి మృతి చెందడంతో అక్కడి స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ పెంపుడు ఏనుగుల వల్ల తాము చాలా భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు ఆ ఏనుగును తన పిల్ల ఏనుగును అదుపులోకి తీసుకున్నారు. ఆ పై సెక్షన్ 304కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ రెండు ఏనుగులను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఇదిలా ఉంటే ఏనుగు పిల్ల చాలా ముద్దుగా ఉండటంతో దాన్ని హగ్ చేసుకునేందుకు రాగా తల్లి ఏనుగు బాలుడిపై దాడి చేసిందని అటవీశాఖ సిబ్బంది చెప్పారు.

జంతువులను అదుపులోకి ఎందుకు..
ఈ కేసు విచారణ అటవీశాఖ సిబ్బంది చేయదని స్పష్టం చేశారు కాజీరంగా డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ రమేష్ గొగోయ్. ఇలాంటి కేసులు చాలా అరుదుగా జరుగుతుంటాయని అయితే విచారణలో భాగంగా పెంపుడు జంతువులను అదుపులోకి తీసుకోవచ్చని విచారణాధికారి ఒకరు వెల్లడించారు. కేసును విచారణ చేసే సమయంలో కావాల్సిన రుజువుల కోసం మాత్రమే వీటిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. 2013లో కూడా కేరళలో జరిగిన ఓ ఆలయ వేడుకల్లో ఓ ఏనుగు ముగ్గురు మహిళలపై దాడి చేసి చంపేసింది. దీంతో ఆ ఏనుగును అదుపులోకి తీసుకోగా.. దాని యజమానులు రూ.30 లక్షలు సెక్యూరిటీ రూపంలో చెల్లించి విడుదల చేయించుకుని తీసుకోపోయారు.












Click it and Unblock the Notifications