ఇంజనీర్ అయ్యాడు: చితిపేర్చుకుని నిప్పంటించుకుని శ్రీనాథరెడ్డి ఆత్మహత్య, డెత్ నోట్ లో ?
చెయ్యని తప్పుకు జైలుకు పంపించారని అవమానంతో యువ ఇంజనీర్ చితిపేర్చుకుని నిప్పంటించుకుని తనకుతాను సజీవదహం చేసుకున్న ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి సమీపంలో జరిగింది.
బెంగళూరు: చెయ్యని తప్పుకు జైలుకు పంపించారని అవమానంతో యువ ఇంజనీర్ చితిపేర్చుకుని నిప్పంటించుకుని తనకుతాను సజీవదహం చేసుకున్న ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి సమీపంలో జరిగింది. చింతామణి తాలుకా వంగమాల గ్రామంలో నివాసం ఉంటున్న శ్రీనాథరెడ్డి (27) ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
ఆరు నెలల క్రితం శ్రీనాథరెడ్డి కర్ణాటక- ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని బాగేపల్లిలో తాలుకా ఉపాధి హామీ పథకం సహాయక ఇంజనీరుగా ఉద్యోగంలో చేరాడు. ఇటీవల ఒక రైతు నుంచి లంచం తీసుకుంటూ శ్రీనాథరెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కిపోయాడు. కేసు నమోదు చేసిన అధికారులు శ్రీనాథరెడ్డిని జైలుకు పంపించారు.
జామీను మీద బయటకు వచ్చిన శ్రీనాథరెడ్డి ఎవ్వరితో మాట్లాడకుండా ఒంటరిగా గడుపుతున్నాడు. శ్రీనాథరెడ్డి తండ్రి వెంకటరెడ్డి గతంలో మరణించడంతో తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. తాను చెయ్యని తప్పుకు బాగేపల్లి గ్రామ పంచాయితీ పీడీఓ అధికారులు కుట్రపన్ని కేసులో ఇరికించారని డెత్ నోట్ రాసిపెట్టాడు.
అర్దరాత్రి ఇంటి సమీపంలోని తన తోటలో చితిపేర్చుకుని పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని తనకుతానుగా శ్రీనాథరెడ్డి సజీవదహనం చేసుకున్నాడు. శ్రీనాథరెడ్డి శరీరం పూర్తిగా కాలి బూడిద అయ్యింది. మరుసటి రోజు ఉదయం విషయం గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీనాథ రెడ్డి డెత్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.