వెజిటేరియన్, మద్యం ముట్టని వారికే గోల్డ్ మెడల్: పుణె వర్సిటీ సంచలనం
పుణె: ఎక్కడైనా విద్యతోపాటు వివిధ రంగాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ ఇవ్వడం చూస్తుంటాం. కానీ, మహారాష్ట్రలో ఓ యూనివర్సిటీ మాత్రం వెజిటేరియన్, మద్యం సేవించని వారికే గోల్డ్ మెడల్ అందిస్తామని పేర్కొనడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పుణె యూనివర్సిటీ.. షెలార్ మామా పేరు కింద గోల్డ్ మెడల్ పొందే విద్యార్థులు వెజిటేరియన్లు అయి ఉండాలని నిబంధన పెట్టింది.
మద్యం సేవించని విద్యార్థులు, వెజిటేరియన్లు మాత్రమే ఈ గోల్డ్ మెడల్ పొందేందుకు అర్హులు అని ప్రకటించింది.

2006 నుంచి యోగా మహర్షి రామ్చందర్ గోపాల్ షెలార్(షెలార్ మామ) పేరిట ఆర్ట్స్ గ్రూప్ల విద్యార్థులకు పుణే వర్సిటీ బంగారు పతకాలను అందిస్తోంది. ఈ మెడల్ను షెలార్ ట్రస్టు, కుటుంబ సభ్యులు అందిస్తున్నారు. ఈ మెడల్ అందుకునే విద్యార్థులు శాఖాహారులై ఉండాలని, మద్యం సేవించే అలవాటు కూడా ఉండకూడదని పుణే యూనివర్సిటీ జారీ చేసిన సర్క్యూలర్లో పేర్కొంది. యోగా, ప్రాణాయామాలను ప్రతి రోజూ చేసే విద్యార్థులకు మొదటిగా పతకానికి అవకాశం ఇస్తారని తెలిపింది.
కాగా, ఈ అంశంపై మహారాష్ట్రకు చెందిన ఎంపీ, శరద్పవార్ కుమార్తె సుప్రియా సూలే ట్విటర్ ద్వారా స్పందించారు. 'మన విశ్వవిద్యాలయాలకు ఏమైంది? మెరిట్ విద్యార్థుల మాటేమిటి? అందరినీ ఒకే విధంగా చూస్తూ, నాణ్యమైన విద్యను అందించండి. విద్యార్థులను ఎందుకు విడదీస్తున్నారు? పుణె యూనివర్సిటీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ, ఈ వార్త విని ఆశ్చర్యపోయాను' అని సుప్రియా సూలే అన్నారు.












Click it and Unblock the Notifications