కొత్త కరెన్సీతో ఉడాయించిన బ్యాంకు ఉద్యోగి
మొహాలీ:కొత్త నగదు కోసం ప్రజలు ఎదురు చూస్తోంటే ఈ నగదును ఎటిఎంలో జమచేస్తానని చెప్పిన ఓ బ్యాంకు అధికారి ఉడాయించాడు. కొత్త నగదు నోట్లతో పారిపోయిన బ్యాంకు అధికారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పంజాబ్ రాష్ట్రంలోని బంకర్ పూర్ గ్రామంలో వింత సంఘటనచోటుచేసుకొంది. ఎటిఎంలో జమచేయాల్సిన సొమ్ముతో బ్యాంకు అధికారి పారిపోయాడు. బంకర్ పూర్ లోని కియోస్క్ ఎటిఎంలో డిపాజిట్ చేసేందుకు కొత్త నగదు పంజాబ్ అండ్ సింద్ బ్యాంకుకు చేరింది. ఈ నగదును ఎటిఎంలో డిపాజిట్ చేయాలని అసిస్టెంట్ మేనేజర్ తేజ్ ప్రతాప్ సింగ్ బాటియాను ఆదేశించారు బ్యాంకు మేనేజర్.
బ్యాంకు మేనేజర్ ఆదేశాల మేరకు బాటియా 6.98 లక్షల కొత్త నగదు కరెన్సీని తీసుకొని ఎటిఎం వద్దకు రావాలని బ్యాంకు ఇంజనీర్లను, సెక్యూరిటీ సిబ్బందిని పురమాయించాడు. తాను కూడ కొత్త కరెన్సీతో ఎటిఎం సెంటర్ వద్దకు వస్తానని చెప్పాడు.
బ్యాంకు ఇంజనీర్, సెక్యూరిటీ సిబ్బంది ఎటిఎం వద్ద ఒకరోజు నిరీక్షించారు. కాని, బాటియా మాత్రం ఎటిఎం వద్దకు రాలేదు. బాటియా కు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ స్విచ్చాప్ వస్తోంది. దీంతో బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బాటియా కోసం గాలిస్తున్నారు.