తండ్రీకొడుకులు భయపడ్డారు: కార్తీ అరెస్టుకు ముందే సుప్రీంలో చిదంబరం పిటిషన్!
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ కేసులో తన కుమారుడు కార్తీ చిదంబరాన్ని అరెస్టు చేస్తారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం అనుమానపడ్డారు. అందుకే ముందుగానే సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేశారు. అయితే ఆ పిటిషన్ ఇంకా విచారణకు రాకమునుపే వారి భయం నిజమైంది. కార్తీ చిదంబరాన్ని దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం అరెస్టు చేసింది.
Recommended Video
మోడీ సర్కారు దూకుడు చూసి చిదంబరం, ఆయన కొడుకు కార్తీ ముందే భయపడ్డారు. అందుకే వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను, తన కుటుంబ సభ్యులను దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయని, వాటిని నిరోధించాలని కోరుతూ చిదంబరం ముందుగానే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దురదృష్టం ఏమిటంటే.. అది విచారణకు ఇంకా రాకపోవడం!
తండ్రీకొడుకుల భయమే నిజమైంది...
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం భయపడిందే జరిగింది. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ ఆయన్ని అరెస్ట్ చేసింది. 2007లో చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కేసులో కార్తి రూ.10 లక్షలు లంచం తీసుకున్నారన్న అభియోగాలు నమోదయ్యాయి.
లండన్ నుంచి వచ్చీరాగానే...
బుధవారం ఉదయం లండన్ నుంచి చెన్నై చేరుకున్న కార్తిని ఏడుగురు సభ్యుల సీబీఐ బృందం చెన్నై విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకుంది. గత మేలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయనపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకు సహకరించడంలేదని కార్తీని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతకు ఒకరోజు ముందు.. అంటే మంగళవారం ఇదే కేసులో కార్తీకి చెందిన సీఏ ఎస్. భాస్కరరామన్కు ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించిన విషయం తెలిసిందే. కేసును తప్పుదోవ పట్టించేందుకు కార్తీ చిదంబరం ప్రయత్నిస్తున్నారని, అందుకే అతడ్ని అదుపులోకి తీసుకున్నామని సీబీఐ పేర్కొంది.
ముందే సుప్రీంకోర్టును ఆశ్రయించిన కార్తీ...
సీబీఐ అధికారుల దర్యాప్తు, ఈడీ నోటీసులపై పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కూడా ముందే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసు విచారణలో భాగంగా మార్చి 1న హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని లేదా విచారణ తేదీని వాయిదా వేయాలని ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 6కి వాయిదా వేసింది.
లండన్ వెళుతున్నా, నేనేం పారిపోను....
కార్తీ చిదంబరం వేసిన పిటిషన్ గత నెల 23నే సుప్రీంకోర్టులో విచారణకు రాగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. కార్తి తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కార్తీ చిదంబరం సొంత పనిమీద తాను లండన్ వెళుతున్నానని, తానేమీ పారిపోనని.. విచారణ తేదీని వాయిదా వేయాలని కోరారు. మరోవైపు ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్.. ‘సీబీఐ అధికారుల ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు, కార్తీని అరెస్టు చేయాలని చూస్తున్నారా?' అని అడగ్గా... సీబీఐ తరపు న్యాయవాది, అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తోసిపుచ్చారు.
సీబీఐదే తుది నిర్ణయం...
సుప్రీంకోర్టులో కార్తీ చిదంబరం పిటిషన్ విచారణ సమయంలో కార్తీ అరెస్టుకు సంబంధించి సీబీఐ తరపు న్యాయవాది, అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ కార్తీ ‘సాధారణ నేరస్థుడు' కాదని పేర్కొన్నారు. ఆ మాటలకు అర్థం.. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చనే సంకేతమే! కార్తీ చిదంబరాన్ని అరెస్టు చేస్తామని తామెప్పుడూ చెప్పలేదన్నారు. కానీ, అరెస్టు విషయంలో సీబీఐదే తుది నిర్ణయమని తుషార్ మెహతా తెలిపారు. ఒకవైపు సీబీఐ కేసు విచారణ జరుగుతుండగా.. ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే విధించాలని లేదా వాయిదా వేయాలని కార్తీ కోరడం సరికాదని ఆయన వాదించారు.
ముందు జాగ్రత్తగా పిటిషన్ వేసినా...
మరోవైపు ఈ కేసులో కీడును శంకించిన చిదంబరం.. తనను, తన కుటుంబ సభ్యులను అదేపనిగా వేధిస్తున్నారని, దీన్ని ఆపాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా ప్రయోజనం లేకపోయింది. నిజానికి కుమారుడు కార్తీపై నమోదైన ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను చిదంబరం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ‘సీబీఐ, ఈడీలు చట్టవిరుద్ధమైన విచారణలతో నన్ను, నా కుటుంబ సభ్యులను వేధిస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఇవి జరుగుతున్నాయి. దర్యాప్తు సంస్థల వేధింపులను అడ్డుకోండి..' అని కోరుతూ స్వయంగా సుప్రీంలో పిటిషన్ వేశారు. కానీ, ఈ పిటిషన్ విచారణకు రాకముందే కార్తీని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.