ఊహించని మెజారిటీ, విజయం మాదే, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు: బళ్లారి శ్రీరాములు ధీమా!
బెంగళూరు: ఊహకుమించిన మెజారిటీ నిరూపించుకుని కర్ణాటకలో అధికారంలో ఉంటామని మాళకాల్మూరు బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి బి. శ్రీరాములు అన్నారు. కర్ణాకటకలో బీజేపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కొనసాగుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని బళ్లారి శ్రీరాములు ధీమా వ్యక్తం చేశారు. గురువారం బెంగళూరులో శ్రీరాములు మీడియాతో మాట్లాడతూ యడ్యూరప్ప ప్రభుత్వానికి ఎలాంటి అడ్డంకులు ఎదరుకావని అన్నారు.
కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లోని ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకత్వం మీద అసహనంతో ఉన్నారని, వారందరూ త్వరలో బీజేపీలో చేరుతారని బళ్లారి శ్రీరాములు బాంబుపేల్చారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీతో ఉన్నారని, వారందరూ బలపరీక్షలో తమకు మద్దతు ఇస్తారని శ్రీరాములు ధీమా వ్యక్తం చేశారు.
మీరే చూడండి
శాసన సభ సమావేశంలో బీఎస్. యడ్యూరప్ప బలపరీక్షలో విజయం సాధిస్తారని బళ్లారి శ్రీరాములు జోస్యం చెప్పారు. బీఎస్. యడ్యూరప్ప బలపరీక్షలో ఎలా విజయం సాధిస్తారో ఆరోజు మీరే చూడండి అని బళ్లారి శ్రీరాములు మీడియాకు చెప్పారు.
ఇబ్బంది ఏముంది!
బీఎస్ యడ్యూరప్పతో పాటు బళ్లారి శ్రీరాములు, ఆర్. అశోక్, కేఎస్. ఈశ్వరప్ప, గోవింద కారజోళ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని మొదట ప్రచారం జరిగింది. ఈ విషయంపై మాట్లాడిన బళ్లారి శ్రీరాములు ఇప్పుడే అంత తొందర ఏముంది అంటూ సమాధానం ఇచ్చారు.
మెజారిటీ ఎమ్మెల్యేలు
మే 15వ తేదీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 104 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. 222 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 112 ఎమ్మెల్యేల మెజారిటీతో బీఎస్. యడ్యూరప్ప తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంది. అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షలో బీజేపీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఆపరేషన్ కమల మొదలుపెట్టింది.
ఏ పార్టీ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్, జేడీఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఏ పార్టీకి చెందిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారు అని చర్చ ఇప్పుడు జోరుగా జరుగుతోంది. మొత్తం మీద బళ్లారి శ్రీరాములు ధీమా చూస్తుంటే ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలతో చర్చలు మొదలైనాయని తెలిసింది.