బెంగాల్ అసెంబ్లీ సంచలనం-ఈడీ, సీబీఐకి వ్యతిరేకంగా తీర్మానం-మోడీపై మమత ప్రశంసలు..
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఇవాళ ఓ కీలక తీర్మానాన్ని అమోదించింది. కేంద్రంలోని బీజేపీతో హోరాహోరీ తలపడుతున్న సీఎం మమతా బెనర్జీ.. కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీనిపై ఓటింగ్ నిర్వహించి మరీ నెగ్గించుకున్నారు. తద్వారా కేంద్ర దర్యాప్తు సంస్ధల విశ్వసనీయతకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం మమతా బెనర్జీ.. కేంద్ర దర్యాప్తు సంస్ధలతో పాటు ప్రధాని మోడీపైనా విమర్శలు చేశారు. బీజేపీ నేతలు ఎవరు కుట్ర పన్నుతున్నారో తెలియడం లేదని, ఇకపై సీబీఐ ప్రధానిని కాదని హోంమంత్రి అమిత్ షాకు నివేదించబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది మోడీ చేసి ఉండరని భావిస్తున్నట్లు మమత తెలిపారు. వ్యాపారవేత్తలు దేశం వదిలి పారిపోతున్నారని, ఈడీ, సీబీఐ భయం, దుర్వినియోగం కారణంగా వారు పారిపోతున్నారని మమత తెలిపారు. మోడీ అలా చేయలేదని తాను నమ్ముతున్నానన్నారు. సీబీఐ ఇకపై ప్రధాని కార్యాలయానికి రిపోర్ట్ చేయదని మీలో చాలా మందికి తెలియదన్నారు. అది హోం మంత్రిత్వ శాఖకు నివేదిస్తుందన్నారు. కొందరు బిజెపి నాయకులు దీనికి కుట్ర పన్నుతున్నారుని, వారు తరచుగా నిజాం ప్యాలెస్కు వెళుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
అయితే బెంగాల్ అసెంబ్లీలో ప్రధాని మోడీని ప్రశంసిస్తూ అమిత్ షాను విమర్శించిన మమత వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి స్పందించారు. ప్రధాని మోడీని ప్రశంసించడం ద్వారా ఆమె తన మేనల్లుడిని రక్షించుకోలేదన్నారు. రాష్ట్రంలోని బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తున్న పార్టీ సీనియర్ నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీని మమత రక్షించుకోవడం కష్టమన్నారు. కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం సిబిఐ, ఇడి మరియు ఇతర ఫెడరల్ ఏజెన్సీలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందన్న విపక్షాల ఫిర్యాదును బెంగాల్ ప్రజల ముందుకు మమత తీసుకెళ్లారు. కేంద్ర సంస్థల అక్రమాలకు వ్యతిరేకంగా తీర్మానం ఈ తీర్మానం 189 ఓట్లతో ఆమోదం పొందింది. 64 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేశారు.