West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?
పశ్చిమ బెంగాల్లో (west bengal) వరుసగా మూడుసార్లు గెలిచి, నాలుగో గెలుపు కోసం ఉవ్విళ్లూరుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (mamata benerjee)కి అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ (bjp) ఈసారి చేయని ప్రయత్నం లేదు. రాష్ట్రంలో బీజేపీ నేతలతో నిత్యం టచ్ లో ఉంటూ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా (Amit Shah) దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. మమతా బెనర్జీ నాలుగోసారి సీఎం కాకుండా ఏం చేయాలో అన్నీ చేస్తున్న బీజేపీ తాజాగా రాష్ట్రంలో ఈసారి గెలిచే సీట్లపై పార్టీలో అంతర్గతంగా సర్వే చేయించింది.
బెంగాల్ ఎన్నికలకు బీజేపీ ముఖ్య వ్యూహకర్తగా ఉన్న అమిత్ షా చేయించిన తాజా సర్వేలో 294 మంది సభ్యులున్న అసెంబ్లీలో తమ పార్టీ 100 సీట్ల మార్కును దాటుతుందని తేలింది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులను పూర్తిస్థాయి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని అమిత్ షా ఆదేశించారు. చివరి దశలో ప్రచారం మరింత ముమ్మరం చేస్తే రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించగలదని షా నమ్ముతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ సీట్లు తక్కువగా వచ్చినా, తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యాన్ని గణనీయంగా తగ్గించి, దానిని స్వల్ప మెజారిటీకే పరిమితం చేసి, భవిష్యత్ రాజకీయ ఎత్తుగడలకు ఆస్కారం కల్పించుకోవాలని బీజేపీ భావిస్తోంది.

తాజా అంతర్గత సర్వేల ప్రకారం బీజేపీ 115 నుంచి 125 సీట్ల మధ్య గెలుచుకోగలదని తెలుస్తోంది. ప్రచారం ప్రారంభంలో అంచనాలు 100 సీట్ల వద్ద ఉండగా, పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ఈ సంఖ్యలు క్రమంగా మెరుగుపడ్డాయని ఎన్నికల వ్యవహారాలు చూస్తున్న ఒక కీలక నాయకుడు తెలిపారు. బీజేపీ తమ అంతర్గత ఫీడ్బ్యాక్ వ్యవస్థతో పాటు, ప్రఖ్యాత ప్రొఫెషనల్ ఏజెన్సీల సేవలను కూడా ఈ సర్వేలకు వాడుకుంటోంది. బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లపై తమ ప్రచారం పట్టణ ప్రాంతాల్లోని బెంగాలీ మాట్లాడే ఓటర్లలోని కొన్ని వర్గాలను ఆకట్టుకుంటోందని, ఇది పార్టీ ఎదుగుదలకు దోహదపడుతోందని పార్టీ నాయకులు చెప్తున్నారు. సర్వే తర్వాత రాష్ట్రంలోనే 15 రోజులు పాగా వేయాలని అమిత్ షా నిర్ణయించుకున్నారట.

బీజేపీ బెంగాల్ వ్యవహారాలు చూసుకునే ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ క్షేత్రస్థాయిలో కార్యకలాపాలను నడిపిస్తుండగా, మహారాష్ట్ర (2024), అంతకుముందు మధ్యప్రదేశ్లో పార్టీ విజయాలకు కారణమైన అనుభవజ్ఞుడైన ఎన్నికల వ్యూహకర్త, కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ను ఎన్నికల ఇన్చార్జ్గా నియమించారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ సహ-ఇన్చార్జ్గా కొన్ని వారాలుగా రాష్ట్రంలోనే మకాం వేశారు. అమిత్ షాకు సన్నిహితుడైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్తో పాటు పలువురు ఇతర మంత్రులు, ఎంపీలను కూడా రంగంలోకి దించారు.












Click it and Unblock the Notifications