డాక్టర్ భార్య అనుమానాస్పద మృతి: లోదుస్తులో బంగారు, డాలర్లు, చోరీ చేసి దూకేసింది!
బెంగళూరు: బెంగళూరు నగరంలోని కిమ్స్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ అవినాష్ అగర్వాల్ భార్య సోనాల్ అగర్వాల్ (25) అనుమానాస్పద మృతి కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చిందని రాజరాజేశ్వరినగర్ (ఆర్ఆర్ నగర్) పోలీసులు అన్నారు. సోనాల్ అగర్వాల్ లో దుస్తుల్లో బంగారు నగలు, యూఎస్ డాలర్లు ఉన్నాయని, ఆమె చోరీ చేసి ఐదవ అంతస్తు నుంచి కిందకు దూకేసిందని పోలీసులు అన్నారు.
చత్తిస్ ఘడ్ కు చెందిన డాక్టర్ అవినాష్ అగర్వాల్, సోనాల్ అగర్వాల్ దంపతులు బెంగళూరు చేరుకుని ఆర్ఆర్ నగర్ లోని ఉత్తరహళ్లి మెయిన్ రోడ్డులోని మంత్రి అపార్ట్ మెంట్ లోని 5వ అంతస్తులోని ఫ్లాట్ నెంబర్ 501లో నివాసం ఉంటున్నారు.
డాక్టర్ అవినాష్ కిమ్స్ ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నారు. అదే అపార్ట్ మెంట్ లో 505 ఫ్లాట్ లో శివమొగ్గకు చెందిన ప్రసాద్ నివాసం ఉంటున్నాడు. ప్రసాద్ జేపీ నగర్ లో సొంతంగా సాఫ్ట్ వేర్ సంస్థను నిర్వహిస్తున్నాడు.
ప్రసాద్ భార్య, సోనాల్ అగర్వాల్ కు పరిచయం ఉంది. గత వారం 13వ తేదీ డాక్టర్ అవినాష్ అగర్వాల్, సోనాల్ అగర్వాల్ దంపతులు ప్రసాద్ ఫ్లాట్ కు వెళ్లారు. ఆ సందర్బంలో సోనాల్ అగర్వాల్ వారి ఫ్లాట్ లో రెండు గంటలకు పైగా ఉంది. వినాయక చవితి పండగకు ఇంటికి రావాలని ప్రసాద్ కుటుంబ సభ్యులు అవినాష్ దంపతులకు చెప్పారు.
అదే రోజు ప్రసాద్ ఫ్లాట్ లోని బీరువా తాళం మాయం అయ్యింది. ఎక్కడో పెట్టి ఉంటామని ప్రసాద్ కుటుంబ సభ్యులు భావించారు. గత ఆదివారం వినాయక చవితి పండుగ సందర్బంగా అపార్ట్ మెంట్ లో గెట్ టూ గెదర్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కార్యాక్రమం మొదలైయ్యింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో ప్రసాద్ మామ కార్యక్రమం నుంచి వారి ఫ్లాట్ కు బయలుదేరారు.
అదే సమయంలో సోనాల్ అగర్వాల్ ప్రసాద్ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చింది. మేము ఫ్లాట్ లో లేని సమయంలో నువ్వు ఎందుకు వెళ్లావని ప్రసాద్ మామ సోనాల్ అగర్వాల్ ను ప్రశ్నించారు. ఆ సందర్బంలో ఫ్లాట్ నుంచి బాల్కనీలోకి సోనాల్ అగర్వాల్ దూకేసింది.
ప్రమాదవశాత్తు సోనాల్ అగర్వాల్ కిందకుపడిపోయి మరణించింది. తన భార్యను ప్రసాద్ భార్య హత్య చేసిందని డాక్టర్ అవినాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనాల్ అగర్వాల్ మృతదేహాన్ని పోస్టుమార్టుంకు తరలించారు.
సోనాల్ అగర్వాల్ లోదుస్తుల్లో బంగారు నగలు, యూఎస్ డాలర్లు ఉన్నాయని డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోనాల్ అగర్వాల్ లోదుస్తుల్లో ఉన్న బంగారు నగలు ప్రసాద్ భార్యవి అని విచారణలో వెలుగు చూసిందని డీసీసీ రవి చెన్ననవర్ అన్నారు.
ప్రసాద్ ఇంటిలో బంగారు నగలు, యూఎస్ డాలర్లు చోరీ చేసిన సోనాల్ అగర్వాల్ ఎక్కడ చిక్కిపోతామో అనే ఆందోళనతో కిందకూ దూకేసిందని, 505 ఫ్లాట్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించి లోతుగా మరింత విచారణ చేస్తున్నామని డీసీపీ రవి చెన్ననవర్ తెలిపారు.