Bharat Bandh: రేపు భారత్ బంద్-సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పుకు నిరసనగా..!
ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాలో మార్పులు చేస్తూ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా ప్రకటించిన తీర్పుపై ఓ వర్గంపై నిరసన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎస్సీ, ఎస్టీల్లో విభజన ఏర్పడుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో రిజర్వేషన్ల రక్షణ కోసం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బంద్ కు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణంగా బంద్ పాటించాలని సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాలని రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి కోరుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సున్నితమైన అంశం కావడంతో దీనిపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రేపటి బంద్ లో అత్యవసర, అంబులెన్స్ సేవలు, ఆసుపత్రులు, వైద్య సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు బంద్ నిర్వాహకులు తెలిపారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పనిచేస్తాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ముందుగానే బంద్ కు సంఘీభావంగా మూసివేసేందుకు సిద్ధమవుతున్నాయి.












Click it and Unblock the Notifications