భారత్ బయోటెక్ అనూహ్య అడుగు -కొవాగ్జిన్ ఫార్ములా పంచుకోడానికి రెడీ -జగన్ లేఖతో మోదీ సర్కార్ కదలిక
దేశంలో కరోనా వైరస్ రెండో దశ విలయం ప్రమాదకరంగా సాగుతూ, వేలమందిని పొట్టనపెట్టుకుంటుండగా, వ్యాక్సిన్ల కొరత వల్ల టీకాల పంపిణీ కార్యక్రమం డీలాపడింది. ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్లకు మాత్రమే అనుమతి ఉండటంతో వాటి ఉత్పత్తి సామర్థ్యం దృష్ట్యా అందరికీ టీకాలు అందాలంటే ఇకొన్ని ఏళ్లు పడుతుంది. ఈ దశలో వ్యాక్సిన్ల ఉత్పత్తిపై భారత్ బయోటెక్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. భారత్ బయోటెక్ అధినేత కులాన్ని, ఆయనకు చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో, ఏపీ సీఎం జగన్ రాసిన లేఖతో మోదీ సర్కార్ కదలడం చర్చనీయాంశమైంది..
ఫార్ములా బదిలీకి ఒకే..
భారత్ లో రోజువారీ కొవిడ్ కేసులు 4లక్షలకు చేరువగా, మరణాలు 4వేలుగా నమోదవుతూ, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 38లక్షలకు చేరువయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా మే1 నుంచి మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలుపెట్టినప్పటికీ టీకాల కొరత కారణంగా అది సజావుగా సాగడం లేదు. ప్రస్తుతానికి కేంద్రం.. భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్, సీరం తయారీ కొవిషీల్డ్ తోపాటు రష్యా వారి స్ఫుత్నిక్-వి వ్యాక్సిన్లకు మాత్రమే భారత్ లో అనుమతిచ్చింది. దేశంలో తయారయ్యే కొవాగ్జిన్, కొవిషీల్డ్ ఉత్పత్తి సామర్థ్యం అవసరాలకు సరిపడినంతగా లేకపోవడంతో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. దీనికి పరిష్కారంగా కొవాగ్జిన్ టీకా ఫార్ములాను ఇతరులకు బదిలీ చేయడానికి భారత్ బయోటెక్ సంస్థ అంగీకరించింది. అయితే..
ఏపీలో కరోనా: తొలిసారి 2లక్షల యాక్టివ్ కేసలు -నిన్న89మంది మృతి, కొత్తగా 22,399 కేసులు -తూర్పులో ఉధృతి
కొవాగ్జిన్ వ్యాక్సిన్
కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఫార్ములాను ఇతర ఫార్మా కంపెనీలకు బదిలీ చేయడానికి భారత్ బయోటెక్ సంస్థ అంగీకరించిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వయంగా వెల్లడించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ అత్యున్నత థింక్ ట్యాంక్ 'నీతి ఆయోగ్'లో వైద్య విభాగం సభ్యుడైన డాక్టర్ వీకే పాల్ గురువారం ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. ''కరోనా కట్టడి కోసం హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన "కోవాగ్జిన్" ఫార్మూలాను మరికొన్ని కంపెనీలకు ఇవ్వనున్నాం. ఇతర సంస్థల్లో కోవాగ్జిన్ ఉత్పత్తిపై భారత్ బయోటెక్ తో చర్చించగా, ఫార్ములా బదిలీకి వారు అంగీకరించారు. ఏదైనా వ్యాక్సిన్ కంపెనీలు తయారీకి ముందుకొస్తే ఫార్ములాని షేర్ చేస్తామని భారత్ బయోటెక్ తెలిపింది'' అని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ పాల్ వివరించారు. కాగా,
జగన్, కేజ్రీవాల్ పట్టుతో ఇలా..
కొవిడ్ విలయ కాలంలో వ్యాక్సిన్లపై పేటెంట్ హక్కులు ఉండరాదని భారత్ అంతర్జాతీయంగా చేస్తోన్న ప్రయత్నాలకు అమెరికా కూడా మద్దతు పలకడం తెలిసిందే. ఇక దేశంలో వ్యాక్సిన్ తయారీకి రెండు కంపెనీలకు మాత్రమే అనుమతించడాన్ని ప్రశ్నిస్తూ, ఆయా కంపెనీల వ్యాక్సిన్ ఫార్ములాను ఇతర కంపెనీలకు బదలాయించేలా చూడాలని ఏపీ సీఎం వైఎస్ జగన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని మోదీ సర్కారుపై ఒత్తిడి చేశారు. ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్రం.. వ్యాక్సిన్ ఫార్ములా బదిలీకి భారత్ బయోటెక్ ను ఒప్పించింది. ఈ నిర్ణయంతో దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి వేగవంతంకానుంది. మరి ఫార్ములాను పంచుకున్నందుకు గానూ భారత్ బయోటెక్ కు ఏమాత్రం గిట్టుబాటు అవుతుంది, పోటీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ పరిస్థితి ఏంటి? దేశమంతా కొవాగ్జిన్ మాత్రమే పంపిణీ అయితే ఇతర వ్యాక్సిన్ల మాటేమిటి? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది..