కొడుకును తెల్లగా మార్చేందుకు రాయితో రుద్దింది, ఏమైందంటే?
భోపాల్: నల్లగా ఉన్న తన కొడుకును తెల్లగా మార్చాలనే ఆ తల్లి కోరిక చివరకు పిల్లాడిని తీవ్రంగా గాయపర్చింది.తెలుపు అంటే విపరీతమైన పిచ్చితో ఆ తల్లి చివరకు జైలు ఊచలు లెక్కిస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ తల్లి నల్లగా ఉన్న తన కొడుకును తెల్లగా మార్చేందుకు రాయితో రుద్దింది. దీంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.పిల్లాడిని గాయపర్చినందుకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నిషత్పూర్లో నివాసం ఉండే సుధాతివారీ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఆమె భర్త ప్రైవేట్ ఆసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి పిల్లలు పుట్టలేదు. దీంతో సుధా తివారి ఏడాది క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మాతృచ్చాయ ఆశ్రమం నుండి ఓ బాలుడిని దత్తత తీసుకుంది.
సుధాతివారి దత్తత తీసుకొన్న బాలుడు నల్లగా ఉన్నాడు. దీంతో ఆమె అత్త అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే పిల్లాడు తెల్లగా కావడానికి ఆమె అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ, ఫలితం లేకపోయింది. చివరకు రాయితో రుద్దితే పిల్లాడు తెల్లగా అవుతాడని సుధాకు ఎవరో సలహ ఇచ్చారు. ఈ సలహ విని ఆమె పిల్లాడిని రాయితో రుద్దింది. దీంతో చిన్నారి ఛాతీ, భుజం, వీపు, కాళ్ళ మీద తీవ్ర గాయాలయ్యాయి.
సుధా సోదరి కూతురైన శోభనశర్మ ఈ విషయమై ఆమెను వారించారు. అయినా సుధా మాత్రం వినలేదు. దీంతో శోభనశర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం నాడు బాలల సంరక్షణాధికారులు, పోలీసులు సుధ ఇంటి నుండి బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆ బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బాలుడిని హింసించినందుకు గాను సుధాతివారీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సుధాతివారిని కఠినంగా శిక్షిస్తామని మధ్యప్రదేశ్ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ ఛైర్మెన్ రాఘవేంద్ర శర్మ చెప్పారు.