అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: టెక్కీ, రెండేళ్ల కుమార్తె దుర్మరణం
బీదర్: అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఆయన కుమార్తె దుర్మరణం పాలయ్యారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భార్య చావుబతులకు మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
మృతుడి పేరు ముఖేష్ శివాజీవర్ దేశ్ముఖ్. వయస్సు 37 సంవత్సరాలు. బీదర్ జిల్లాలోని భాల్కీ తాలూకా కొంగళ్లి గ్రామానికి చెందిన వ్యక్తి. కొన్నేళ్ల కిందట అమెరికాకు వెళ్లాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా స్థిరపడ్డారు. మూడేళ్ల కిందట అతనికి బీదర్ జిల్లాకే చెందిన మౌనిక దేశ్ముఖ్తో వివాహమైంది. దేశ్ముఖ్ దంపతులకు ఓ కుమార్తె. పేరు దివిజ.
దివిజ రెండో పుట్టినరోజును పురస్కరించుకుని దేశ్ముఖ్ కుటుంబం కారులో నార్త్ కరోలినా నుంచి మిర్టల్ బీచ్కు ప్రయాణమైంది. మార్గమధ్యలో ఛాడ్బర్న్ ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వచ్చిన ట్యాంకర్ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కారును నడిపిస్తున్న ముఖేష్ దేశ్ముఖ్, ఆయన రెండేళ్ల కుమార్తె దివిజ అక్కడికక్కడే మరణించారు. మౌనిక తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె నార్త్ కరోలినా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.