Big Breaking : కేంద్రానికి సుప్రీం భారీ షాక్ ! ఈడీ బాస్ టర్మ్ పొడిగింపు చెల్లదని తీర్పు..
దేశవ్యాప్తంగా విపక్షాల్ని కేంద్రం ఈడీ సాయంతో టార్గెట్ చేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పు ఇచ్చింది. ఈడీ డైరెక్టర్ ఎస్కే మిశ్రా పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. చట్టప్రకారం ఇది చెల్లదని స్పష్టం చేసింది. ఇది 2021లో తాము ఇచ్చిన తీర్పును ఉల్లంఘించేలా ఉందని తెలిపింది. జూలై 31లోగా మిశ్రాతో రాజీనామా చేయించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్ధ అయిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసుల్ని ప్రధానంగా దర్యాప్తు చేస్తోంది. ఈడీ ప్రధానంగా విపక్షాల్ని టార్గెట్ చేస్తూ వరుసగా కేసులు నమోదుచేయడం, అరెస్టు చేయడం చేస్తోందని విపక్షాలు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో ఈడీ పరిధిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆయా పిటిషన్లను తోసిపుచ్చింది. దీనిపై విపక్షాల పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో కేంద్రం ఈడీ డైరెక్టర్ ఎస్కే మిశ్రా పదవీకాలం పొడిగిస్తూ ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదం అయ్యాయి.
మరోవైపు విచారణ సందర్భంగా కేంద్రం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆర్ధిక అక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్న వేళ వెంటనే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఛీఫ్ ను పదవి నుంచి తప్పిస్తే సమస్యలు వస్తాయని అభ్యంతరం తెలిపింది.దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఆయన్ను ఈ నెల31 వరకూ పదవిలో కొనసాగించేందుకు అభ్యంతరం లేదని పేర్కొంది. ఆలోపు మరో అధికారిని ఈడీ ఛీఫ్ గా ఎంపిక చేయాలని సూచించింది. వాస్తవానికి 2018 నవంబర్ లో మిశ్రా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్గా నియమితులయ్యారు. రెండేళ్ల తర్వాత ఆయన 60 ఏళ్లు పూర్తికావడంతో పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ 2020 నవంబర్ లో కేంద్రం ఆయన పదవీకాలం పొడిగించింది.
సంజయ్ మిశ్రా పదవీకాలంలోనే ఈడీ ఎక్కువగా విమర్శల పాలైంది. ఈడీ తీరుపై ఇప్పటికే పలు విపక్ష ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు అసంతృప్తిగా ఉన్నాయి. కేంద్రం ఈడీ సాయంతో తమను టార్గెట్ చేస్తోందని గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఈ నెలాఖరులోగా ఆయన తప్పుకోవడం ఖాయమైంది. అయితే కేంద్రం మరో అధికారిని నియమించేందుకు ప్రక్రియ చేపట్టాల్సి ఉంది.












Click it and Unblock the Notifications