మసీదుల్లో అజాన్ వ్యతిరేకులపై బీహార్ సీఎం నితీశ్ ఫైర్-వారికి మతంతో సంబంధం లేదని వ్యాఖ్య
కర్నాటకలోని పలు చోట్ల మసీదుల్లో నమాజ్ కు ముందు వినిపించే పిలుపు (అజాన్)ను వ్యతిరేకిస్తూ హిందూ సంస్ధలు చేపడుతున్న నిరసనలపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వారికి మతంతో సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
మసీదుల వద్ద లౌడ్ స్పీకర్ల చుట్టూ వివాదాలు తీవ్రమవుతున్న నేపథ్యాలో వివిధ మతాలు వేర్వేరు ప్రార్థనా విధానాలను కలిగి ఉన్నాయని, వాటిపై ఒకరిపై ఒకరు పోరాడుకోవడం సరికాదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు.
మసీదులపై నుంచి లౌడ్ స్పీకర్లు తొలగించాలంటూ మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన ఛీఫ్ రాజ్ థాకరే చేసిన డిమాండ్ కు నితీశ్ కేబినెట్ లోని బీజేపీ మంత్రి మద్దతిచ్చి్న నేపథ్యంలో నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మసీదుల వద్ద ఆజాన్, లౌడ్ స్పీకర్ల చుట్టూ వివాదాలు సృష్టిస్తున్న వారికి మతంతో సంబంధం లేదని, ప్రజలు వారి మతాన్ని అనుసరించాలని, వారిని అడ్డుకోవద్దని అన్నారు.
ప్రజలు తమ మనసుకు ఏది అనిపిస్తే అది చెబుతారని, ప్రేమ, సౌభ్రాతృత్వ వాతావరణం ఉండాలని, ప్రతి మతానికి దాని స్వంత మార్గాలు ఉన్నాయని, దీని గురించి మనలో మనం గొడవ పడకూడదని నితీశ్ కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ మతాన్ని అనుసరించాలని, ఎవరైనా ఈ సమస్యలపై వివాదాలు సృష్టిస్తే, వారికి మతంతో సంబంధం లేనట్లేనని నితీష్ కుమార్ వెల్లడించారు. ఈ అంశంపై తన మిత్రపక్షమైన బిజెపి వైఖరి భిన్నంగా ఉన్నప్పటికీ నితీశ్ మాత్రం దాన్ని వ్యతిరేకించడం విశేషం.